Padi Kaushik Reddy | హుజురాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ 2 లక్షల 2 వేల ఉద్యోగాలు ఇచ్చారని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఇన్ని ఉద్యోగాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు. ఒక వేళ ఇచ్చినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కౌశిక్ రెడ్డి తేల్చిచెప్పారు. హుజురాబాద్లో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసి నోటిఫికేషన్లకు సంబంధించిన 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి.. తామే వాటిని భర్తీ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ఎవరికో పిల్లలు పుడితే నాకు పుట్టిర్రు అని ముద్దాడినట్టు కాంగ్రెసోళ్ల కథ ఉంది. 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారు..? పరీక్షలు ఎప్పుడు నిర్వహించారు..? ఫలితాలు ఎప్పుడు ఇచ్చారు..? అని ప్రశ్నించారు. ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని.. ఇది వాస్తవమని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతోంది. లక్ష మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలవబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి అద్భుతమైన స్పందన వస్తోంది. రైతులు కేసీఆర్కు ఓటేస్తామంటున్నారు. కేసీఆర్ పాలనలో ఒక్క ఎకరం ఎండిందా..? రైతుబంధు రాకుండా ఉందా..? కరెంట్ రాకుండా ఉందా..? కేసీఆర్ దిగిపోగానే నీళ్లు, రైతుబంధు, కరెంట్ బంద్ అవుతాయా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ కోసం రైతులు ఏకమవుతున్నారు. బోయిన్పల్లి వినోద్ కుమార్కు రైతులు, యువత ఓటు వేయబోతున్నారు. ఏ రాష్ట్రంలోనైనా చూపిస్తే.. యువత, రైతులు కేసీఆర్ వైపు చూస్తున్నారు. పెన్షన్ దారులు కూడా కేసీఆర్కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు అని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.