హైదరాబాద్: భాష మార్చుకోవాల్సింది తాను కాదని.. సీఎం రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి (Padi Kaushik Reddy) విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలపై ప్రశ్నిస్తున్నందుకే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మాసబ్ట్యాంక్ సీఐ ఎదుట కౌశిక్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు తనను గంటపాటు విచారించారని, 32 ప్రశ్నలు అడిగారన్నారు. అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడిగారని చెప్పారు. తాను అన్నింటికీ సమాధానం ఇచ్చానని, తన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ 420 హామీలు, 6 గ్యారంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటానని వెల్లడించారు.
డిసెంబర్ 4న ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లానని తెలిపారు. ఏసీపీ అపాయింట్మెంట్ తీసుకునే అక్కడికి వెళ్లానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి తన ఫోన్ను ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి వెళ్తే తనపైనే తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటివరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఒక రౌడీషీటర్ ఇచ్చిన ఫిర్యాదుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై కేసు నమోదుచేశారని చెప్పారు. కానీ బాధ్యతకలిగిన ఎమ్మెల్యేగా తాను ఫిర్యాదు చేస్తేమాత్రం కంప్లైంట్ ఫైల్ చేయలేదన్నారు. పోలీసులే ముందుండి కాంగ్రెస్ గూండాలతో దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. పండుగ రోజు కూడా తనను దొంగలా అరెస్టు చేశారని మండిపడ్డారు. భాష మార్చుకోవాల్సింది తాను కాదని, సీఎం రేవంత్ రెడ్డేనని చెప్పారు.