జమ్మికుంట, జనవరి 23 : ‘గ్రామ సభకు ఇంత మంది పోలీసులెందుకు? కొట్టి సంపుతరా ఏంది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిందే. పథకాల కోసం ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకోవాలో చెప్పండి. పథకాలు అమలయ్యేంత వరకు ప్రజల గొంతుకనవుతా. ప్రశ్నిస్తూనే ఉంటా. ఎన్ని కేసులు పెడతారో.. పెట్టుకోండి. హామీలన్నీ నెరవేరేదాకా నిద్రపోను. మిమ్మల్ని నిద్రపోనియ్య. మీకు దండం పెడుతున్నా.. అర్హులందరికీ పథకాలు ఇయ్యండి’ అంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సైదాబాద్లో గురువారం గ్రామసభను నిర్వహించారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి వస్తున్నారనే సమాచారం మేరకు డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, సిబ్బందితోపాటు ప్రత్యేక బలగాలు బందోబస్తు నిర్వహించాయి. ఎమ్మెల్యే రాగానే అధికారులు సభను ప్రారంభించారు. పలు పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంపికైన పేర్ల జాబితాను చదివి వినిపించారు. వెంటనే స్థానికులు ఒక్కసారిగా లేచి, అర్హులకు పథకాలు ఎందుకియ్యడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అప్పటివరకు స్టేజీ మీద ఉన్న ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి.. ప్రజల మధ్యకు వెళ్లారు. వాళ్ల మధ్య కూర్చుని సమస్యలు తెలుసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించారు. అర్హుల పేర్లు ఎందుకు జాబితాలో లేవో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. ప్రజలు అధికారులను అడిగేందుకు ముందుకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే కుర్చీ నుంచి దిగి కింద కూర్చున్నారు. అర్హులైన అందరికీ పథకాలు అమలు చేయాలని గులాబీ పూలు అందిస్తూ వినూత్న తరహాలో నిరసన తెలిపారు. పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని, పూర్తిస్థాయిలో పథకాలు అమలు కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే వెళ్లిపోయారు.
వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభకు సుమారు 150 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి వస్తున్నారనే సమాచారంతో మునుపెన్నడూ లేనివిధంగా పోలీసులు మోహరించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.