హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం ఉదయం (3న) భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల (ఆర్వో) కార్యాలయాలను సిద్ధంచేసింది. ఆయా కార్యాలయాల్లో 3 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు.
ఈ నెల 5వ ఆదివారం సెలవు కావడంతో నామినేషన్లు తీసుకోరు. ఒకే రోజు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వస్తే వారికి స్లిప్లు ఇచ్చి అందరూ నామినేషన్లు వేసే అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మంచి రోజులు ఉన్నాయని సమాచారం. ఈ మూడు రోజుల్లోనే ఎక్కువ సంఖ్యలో నామినేషన్లన్లు దాఖలవుతాయని అంచనా వేస్తున్నారు. నామినేషన్ రోజు నుం చి ఎన్నికల ఖర్చును పరిగణనలోకి తీసుకుంటారు.
జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.10 వేల డిపాజిట్
రాష్ట్రంలో ఎక్కడ ఓటు ఉన్నా అభ్యర్థిగా పోటీ చేయవచ్చు. అయితే ఆయనను బలపరిచే వారు మాత్రం స్థానిక నియోజకవర్గానికి చెందిన వారై ఉండాలని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఒక అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈ సారి ఈ నామినేషన్లలో మార్పులు చేసింది. అఫిడవిట్ను అసంపూర్తిగా నింపి ఇస్తే దానికి ఆర్వో నోటీసులు జారీ చేస్తారు. అభ్యర్థి దానిని సవరించాల్సిందిగా సూచిస్తారు. అప్పటికీ అభ్యర్థి స్పందించకుంటే నామినేషన్ను తిరస్కరించే అధికారం ఆర్వోకు ఉన్నది. నామినేషన్ దాఖలు చేయడానికి జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు ధరావత్తు కింద చెల్లించాల్సి ఉంటుంది.
ఎన్నికల షెడ్యూల్ ఇలా
10న పరిశీలకుల రాక
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల పరిశీలకులు ఈ నెల 10న రాష్ర్టానికి రానున్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు, శాంతిభద్రతల పరిశీలకుడు, వ్యయ పరిశీలకుడు ఇలా ముగ్గురు పరిశీలకులను ఈసీ నియమించింది. సాధారణ పరిశీలకులుగా ఇతర రాష్ర్టాలకు చెందిన ఐఏఎస్ అధికారులు, శాంతిభద్రతల పరిశీలకులుగా ఐపీఎస్ అధికారులు, వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారులు రానున్నారు. ఓట్ల లెక్కిం పు పూర్తయ్యే వరకు రాష్ట్రంలో ఉంటారు. వీరు ఎప్పటికప్పుడు, అభ్యర్థి, రాజకీయ పార్టీల కార్యకలాపాలు, సమావేశాలు, సభలను పరిశీలిస్తారు. పరిస్థితులపై ఎన్నికల సంఘానికి నివేదిక ఇస్తుంటారు.