వరంగల్ : స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత, బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బాపూజీ 108వ జయంతిని సందర్భంగా వరంగల్ కొత్తవాడ జంక్షన్లో ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమకారుడిగా, ప్రజాస్వామికవాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడిగా పలు పార్శ్వాలతో నేటి తరానికి ఆదర్శంగా నిలిచారన్నారు. టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు తన నివాసం జలదృశ్యాన్ని పార్టీ ఆఫీసు కోసం ఇచ్చిన గొప్ప నేత అన్నారు. అలాగే తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన మొదటి వ్యక్తి అని ప్రశంసించారు.
చేనేత, సహకర రంగాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణకు మహనీయుడు చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మరావు, తదితరులు పాల్గొన్నారు.