పెద్దపల్లి, మే 2 (నమస్తే తెలంగాణ): రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎన్నికల సంఘం నిబంధనలను తుంగలో తొక్కారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరుతూ గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎల్ఐసీ కార్యాలయంలో ప్రచారం చేశారు. ఓట్లు అభ్యర్థించడమే గాక కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎల్ఐసీ కార్యాలయ ఆవరణలోనే బ్రాంచ్ మేనేజర్ నందిగాం శ్రీనివాస్రావు, ఏబీఎం నాగేంద్రకుమార్, ఏవో శ్రీనివాస్తో కలిసి సిబ్బంది, ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు.
ఈసీ నిబంధనలకు నీళ్లొదులుతూ సదరు నేత చేసిన పనికి ఆ సంస్థ బ్రాంచి మేనేజర్, మరో ఇద్దరు అధికారులు సహకరించడ మే కాకుండా ఏకంగా సమావేశ వేదికను అలంకరించి మద్దతు పలికారు. అంతకుముం దు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యేను ఎల్ఐసీ బ్రాంచి ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా సన్మానించి స్వామి భక్తిని చాటుకున్నారు. ఇన్సూరెన్స్ సంస్థ అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమావేశంలో పాల్గొన్న మకాన్ సింగ్ చేతిగుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వంశీని గెలిపిస్తే ఏజెంట్ల సంఘ భవన నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఎల్ఐసీ కార్యాలయంలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడంతోపాటు అందుకు సహకరించిన బ్రాంచి మేనేజర్, సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.