నీలగిరి/కంటోన్మెంట్, ఫిబ్రవరి 13: నల్లగొండ మండలం చర్లపల్లిలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కారును ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి బలంగా ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో విధుల్లో ఉన్న హోంగార్డు మృతిచెందారు. ఎమ్మెల్యే లాస్య తలకు గాయాలయ్యాయి. మరో కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. నల్లగొండ రూరల్ ఎస్ఐ శివకుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం చలో నల్లగొండ బహిరంగ సభ అనంతరం ట్రాఫిక్ సమస్య రాకుండా జిల్లా కేంద్రం సమీపంలోని చర్లపల్లిలో జంక్షన్ వద్ద నల్లగొండకు చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్, నార్కట్పల్లి హోంగార్డు మెరుగు కిశోర్ (42) విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ సమయంలో హైదరాబాద్ నుంచి నల్లగొండ వైపు వేగంగా వచ్చిన స్విఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందిపైకి వెళ్లింది. ముందుగా హోంగార్డు కిశోర్ను ఢీ కొట్టడంతో అతడు రోడ్డుకు అవతల వైపు ఎగిరిపడ్డాడు. అదే కారు ఎదురుగా వస్తున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కారునూ ఢీకొట్టింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కారు అదుపు తప్పి కింద పడిన హోంగార్డు కిశోర్ మీదుగా వెళ్లింది. తీవ్రంగా గాయపడిన కిశోర్ను దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. స్వల్ప గాయాలైన కానిస్టేబుల్ శ్రీనివాస్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నల్లగొండ రూరల్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు.
కారు ఢీకొన్న ఘటనలో ఎమ్మెల్యే లాస్య తలకు గాయాలయ్యాయి. అదే కారులో ఎమ్మెల్యేతోపాటు ఆమె సోదరి నివేదిత, ఇద్దరు గన్మెన్లు ఉన్నారు. వీరికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి వేరే కారులో హైదరాబాద్కు చేరుకున్నారు. ఎమ్మెల్యే లాస్యనందిత కారు ప్రమాదానికి గురైందన్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో ఆమెను పరామర్శించారు. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, పద్మారావుగౌడ్తోపాటు బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఆశావహ అభ్యర్థి చామకూర భద్రారెడ్డి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. లాస్య నందితను ఫోన్లో ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.