బీబీనగర్ (భూదాన్ పోచంపల్లి ), జనవరి 28: చేనేత వస్ర్తాలపై కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేసేవరకు రాష్ట్ర ప్రభుత్వం పోరాటం ఆపదని ఎమ్మెల్సీ ఎల్ రమణ స్పష్టం చేశారు. అఖిల భారత పద్మశాలీ సంఘం పిలుపు మేరకు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి లక్ష పోస్టుకార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎల్ రమణ మాట్లాడుతూ.. నూలుతో తయారయ్యే వస్ర్తాలపై చరిత్రలో ఏ ప్రభుత్వం పన్నులు వేయలేదని గుర్తుచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వస్ర్తాలపై 5 శాతం జీఎస్టీని విధించి దాన్ని 12 శాతానికి పెంచేందుకు యత్నిస్తున్నదని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీఎస్టీ పెంపును అంగీకరించేది లేదని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం చైర్మన్ యర్రమాద వెంకన్న, అధ్యక్షుడు శ్రీధర్ సుంకార్వార్, తెలంగాణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు మ్యాడం బాబూరావు తదితరులు పాల్గొన్నారు.