జోగులాంబ గద్వాల : పేదింటి ఆడపడుచులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో తల్లిదండ్రులు ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే ఇబ్బందులు పడేవారని, ఇది గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డల పెళ్లి కానుకగా లక్షా నూట పదహారు రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తున్నారని చెప్పారు.
దేశంలో ఇలాంటి పథకం మరెక్కడా లేదన్నారు. సీఎం కేసీఆర్ సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అందించే సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.