KP Vivekananda | ‘పార్టీలు మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో ఉరికించి కొట్టాలి. నడిబజారులో ఉరి వేయాలన్న’ వ్యాఖ్యలకు సీఎం రేవంత్రెడ్డి కట్టుబడి ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కోవ లక్ష్మి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని యావత్ తెలంగాణ ఎదురు చూస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ అన్ని వ్యవస్థలను తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ప్రజాస్వామ తెలంగాణ స్థాపిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి.. దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఎన్నిసార్లు స్పీకర్ను కలిసినా ఆయన సమయం ఇవ్వడం లేదన్నారు. దీంతో తమ లీగల్ టీమ్తో సంప్రదించి.. రిజిస్టర్ పోస్టులో స్పీకర్ కార్యాలయానికి తమ పిటిషన్ పంపామని అన్నారు. అలాగే మెయిల్ ద్వారా కూడా స్పీకర్కు సమాచారం ఇచ్చామన్నారు. పార్టీ మారిన వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని కోరినట్లు చెప్పారు. మూడు నెల్లలో సరైన నిర్ణయం తీసుకోవాలనే సుప్రీం కోర్టు వ్యాఖ్యలను జత చేశామన్నారు.
తెలంగాణకు కూడా హిమాచల్ తీర్పు వర్తించాలి.. హిమాచల్ ప్రదేశ్లో కూడా పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గుర్తు చేశారు. అదే తీర్పు కూడా తెలంగాణకు కూడా వర్తించేలా ఇక్కడి కాంగ్రెస్ నాయకులు చొరవ తీసుకోవాలన్నారు. పార్టీ మారిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఎలాంటి పోరాటం చేయాడానికైనా తామంతా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. పార్టీమారిన వారిని సస్పెండ్ చేయడం తప్పా వేరే మార్గం లేదన్నారు.
సుప్రీంకోర్టు తీర్పుకు కూడా రాజకీయ రంగు పులుమితే.. ఎక్కడికక్కడ ధర్నాలు, దీక్షలు చేస్తామని, వెనకడుగు వేయబోమని హెచ్చరించారు. రాజీనామా చేయకుండా పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేసేందుకు చట్టం తీసుకురావాలని రాహుల్ గాంధీ అంటుంటే.. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలను వేదికపై కూర్చోబెట్టుకోవడం సిగ్గు చేటన్నారు. రాహుల్ నీతులు చెబుతుంటే.. రేవంత్ గోతులు తవ్వుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాక కన్ఫ్యూజన్లో ఉన్నది, అవినీతిలో కూరుకుపోయిందన్నారు. వారి పార్టీ ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేక.. రేవంత్రెడ్డి ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు.