హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీ రాష్ర్టానికి చుట్టపుచూపుగా వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి పోవుడు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేవిధంగా బీజేపీ నేతలు ప్రధానిపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం ఆదుకోవాల్సింది పోయి వాటి ఆస్తులను తమ గుప్పిట పెట్టుకొని వాటిపై ఆధారపడిన కార్మికులను రోడ్డున పడేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని పర్యటనతో రాష్ర్టానికి ఏమాత్రం ప్రయోజనం లేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఏం చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేంద్రం నుంచి పైసా ప్రోత్సాహం లేదని అన్నారు.
మేకిన్ ఇండియా అనే అందమైన నినాదాన్ని ఎత్తుకొని కేంద్రం ఆర్భాటం చేయటమే తప్ప హెచ్ఎంటీ, బీహెచ్ఈఎల్ వంటి సంస్థలను ఆదుకోవటంలో విఫలమైందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల వేలాది మంది హెచ్ఎంటీ కంపెనీ కార్మికులు రోడ్డుపాలు అయ్యారని, దీనికి కేంద్రం ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. దేశవ్యాప్తంగా అనేక లాభసాటి ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా ప్రైవేట్ పరంచేస్తూ వాటిపై ఆధారపడిన కార్మికుల రక్తం తాగడమే కేంద్రం విధానమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు 1 లక్షా 32 వేల ఉద్యోగాలను భర్తీ చేసి, మరో 90 వేల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టిందని, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీగా ఉన్న దాదాపు 15 లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తుందో ప్రధాని మోదీ తన రాష్ట్ర పర్యటన సందర్భంగా బదులివ్వాలని అన్నారు. ప్రధానిపై ఒత్తిడి తెచ్చి కేంద్రం నియామకాల ప్రక్రియను చేపట్టే విధంగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నేతలపై ఉన్నదని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ర్టాల్లో గవర్నర్ వ్యవస్థను అడ్డంపెట్టుకొని బీజేపీ రాజకీయాలు చేయాలని చూస్తే కుదరదని తేల్చిచెప్పారు. విభజన హామీలను కేంద్రం ఎప్పుడు నెరవేరుస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
సీఎంను వద్దని పీఎంవోయే చెప్పిందిగా…
ప్రొటోకాల్ పాటించే విషయంలో, సంప్రదాయాలను గౌరవించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తరువాతే ఎవరైనా అని ఎమ్మెల్యే వివేకానంద చెప్పారు. గురువారం ప్రధాని పర్యటన సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో భారత్ బయోటెక్ సందర్శన సందర్భంగా ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయమే సీఎం కేసీఆర్ రావాల్సిన అవసరం లేదనట్టుగా పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాజకీయాలు చేయటం తమ విధానం కాదని, అదే సందర్భంలో ప్రొటోకాల్ పాటించటంలో..మర్యాదలు పాటించే విషయంలో ఎవరికీ ఏ లోటు రాకుండా సీఎం కేసీఆర్ చూస్తారని ఆయన చెప్పారు.
కిషన్రెడ్డివి దిగజారుడు రాజకీయాలు: కాలేరు
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తన స్థాయిని తానే తగ్గించుకొని దిగజారి వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆరోపించారు. కేంద్రమంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న కిషన్రెడ్డి సీఎం కేసీఆర్ను, మంత్రి కేటీఆర్ను విమర్శించటం సరికాదన్నారు. కేంద్రమంత్రిగా కిషన్రెడ్డి రాష్ర్టానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికే కాకుండా 18 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన సొంత నియోజకవర్గానికి ఏం చేశారని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోవటమే కాకుండా ఎదుగుతున్న రాష్ర్టాభివృద్ధిలో కిషన్రెడ్డి పాత్ర శూన్యమని అన్నారు. రాష్ట్రంపై కేంద్రంచూపుతున్న వివక్షపై కిషన్రెడ్డి వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.