వికారాబాద్ : కేసీఆర్ సహకరాంతో గతంలో ఇచ్చిన హామీలను అన్నీ నెరవేర్చినం. మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని పరిగి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి(MLA Mahesh reddy )అన్నారు. బుధ వారం ఆయన పరిగి(Parigi)లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పరిగిలో ప్రజల 30 ఏండ్ల కల డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి పాటుపడ్డారన్నారు.
పరిగి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం అనేక నిధులు కేటాయించారని పేర్కొన్నారు. అడగక ముందే అనేక నిధులు కేటాయించి పరిగి ప్రగతికి తోడ్పడ్డారని పేర్కొన్నారు. అలాగే పరిగి మండల కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు కుల్కచర్లలో ఐటీఐ, జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.