MLA Satyanarayana | మానకొండూర్, జనవరి 29: మండల సర్వసభ్య సమావేశంలో ప్రొటోకాల్ ప్రకారం ఉండాల్సిన తన సీటు ఏదీ అని అడిగిన జడ్పీటీసీ సభ్యుడిపై మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దురుసుగా ప్రవర్తించారు. ‘ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇన్ని రోజులు మీరు డయాస్ మీదనే కూర్చున్నరు.
కానీ, ఇప్పుడు కుదరదు. ఇది మీ పాలన కాదు. నీకు ఇష్టం ఉంటే దిగువన కేటాయించిన కుర్చీలో కూర్చో. లేకుంటే వెళ్లిపోవచ్చు. గెట్లాస్ట్’ అని హెచ్చరించారు. సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ప్రొటోకాల్ ప్రకారం డయాస్పై కుర్చీ వేయకపోవడాన్ని జడ్పీటీసీ శేఖర్గౌడ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, కవ్వంపల్లి అహంకార పూరితంగా మాట్లాడారు.
‘నేను మీతో గొడవపెట్టుకోవడానికి రాలేదు. మీరు ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి సర్వసభ్య సమావేశానికి వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా వెల్కమ్ చెప్పడానికి మాత్రమే వచ్చానని’ శేఖర్గౌడ్ బదులిచ్చారు. ఎమ్మెల్యే మాటలతో కలత చెందిన శేఖర్.. ‘సర్వసభ్య సమావేశానికి వచ్చే అర్హత జడ్పీటీసీకి ఉన్నదా..? లేదా..?’ తెలుపాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే పోలీసులను పురామాయించడంతో సీఐ రాజ్కుమార్, ఎస్సై శ్రీకాంత్గౌడ్, సిబ్బంది శేఖర్గౌడ్ను బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు.
హు ఈజ్.. ఫసీ అహ్మద్?
సర్వసభ్య సమావేశంలో మానకొండూర్ విద్యుత్తు సబ్స్టేషన్ ఏఈ ఫసీ అహ్మద్ ప్రగతి నివేదిక చదివి వినిపిస్తుండగా, ఎమ్మెల్యే కల్పించుకుని ‘హు ఈజ్.. ఫసీ అహ్మద్. ముందుగా ఫసీ అహ్మద్ అంటే ఎవరో నాకు తెలియాలి కదా? నేను ఎమ్మెల్యేగా ఎన్నికై ఇన్ని రోజులవుతున్నా.. మీరు నన్ను కలువలేదు’ అని మండిపడ్డారు. వెంటనే అహ్మద్ మాట్లాడుతూ.. ‘మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే మా ఉన్నతాధికారులు, రెండు మండలాల ఏఈలతో కలిసి మిమ్మల్ని కలిశాం’ అని గుర్తుచేశారు. అయినా తనను ఎవరు కలువలేదని ఎమ్మెల్యే అనడంతో మిగతా అధికారులు కంగుతున్నారు. ఇంతలోనే ఎంపీపీ కల్పించుకుని ‘మీ విద్యుత్తు శాఖ అధికారులు కాదు, మండలంలోని వివిధ శాఖల అధికారులందరూ ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలవాల్సిందే’ అని చెప్పడంతో అందరూ విస్తుపోయారు.