వరంగల్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మగతనం గురించి జుగుప్సాకరమైన భాష మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లు గెలుచుకొని తన మగతనం నిరూపించుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేక, ప్రజల దృష్టిని మరల్చేందుకే రేవంత్రెడ్డి జుగుప్సాకరమైన భాషతో ప్రతిపక్ష పార్టీపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో మగతనం ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదని, రాజకీయాలకు మగతనానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. బుధవారం ఆయన హనుమకొండలో మీడియాతో మాట్లాడుతూ.. సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ ఇద్దరూ మహిళలేనని, వారి నాయకత్వంలో పనిచేస్తున్న రేవంత్రెడ్డి పదేపదే మగతనం గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో మగతనం గురించి మాట్లాడుతున్న రేవంత్ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, ప్రియాంకగాంధీని కూడా అవమానిస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ ఎంపీగా ఉన్న మల్కాజిగిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కచోట కూడా కాంగ్రెస్ను గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లు గెలుచుకొని మగతనం నిరూపించుకోవాలని సవాల్ చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొట్టడానికే మేడిగడ్డకు బీఆర్ఎస్ వెళ్తున్నదని స్పష్టంచేశారు. రేవంత్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయం గ్రహించి భాష మార్చుకోవాలని హితవు చెప్పారు. ముఖ్యమంత్రిని అనే సోయి లేకుండా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. రోజురోజుకు సహనం కోల్పోయి ప్రతిపక్షంపై దాడి చేస్తున్నారని, గత సీఎంపై పరుషపదజాలం ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలపై మాట్లాడుతున్న వారిపై దాడులు చేస్తున్నారని, సీఎం రేవంత్ తీరు జుగుప్సాకరంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సీఎంగా కాకుండా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని హితవు చెప్పారు.
పథకాలను వైఫల్యాలుగా చిత్రీకరించొద్దు
గత పదేండ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని, కేంద్ర ప్రభుత్వంతోపాటు అంతర్జాతీయ సంస్థల మెప్పుపొందరని కడియం శ్రీహరి వివరించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రతి పల్లెకు, గూడేనికి రక్షిత మంచినీరు అందించిన కేసీఆర్ పాలనా దక్షతను ప్రశంసించకపోయినా ఫర్వాలేదు గానీ గత ప్రభుత్వం అమలుచేసిన పథకాలను వైఫల్యాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దని హితవు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిత్యం కేసీఆర్పై, గత ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ తెలంగాణ ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో దిగజార్చుతున్నారని మండిపడ్డారు. ఇది ఇలాగే కొనసాగితే తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదని, రూ.93 కోట్ల ప్రాజెక్టులో మేడిగడ్డకు పెట్టిన ఖర్చు రూ.3 వేల కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు. అందులో మూడు పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని, పిల్లర్లు కుంగిపోవడానికి సాంకేతిక కారణాలు, డిజైన్ లోపం, అధిక నీటి స్టోరేజ్ లాంటి అనేక సమస్యలు ఉండొచ్చని పేర్కొన్నారు. నిపుణులతో అధ్యయనం చేసి అసలు కారణాలను తేల్చాలని సూచించారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ రాజకీయం కోసమే వాడుకుంటున్నదని, రైతుల కోణం నుంచి కూడా ఆలోచించాలని హితవు చెప్పారు. గోదావరి నదిలో జూన్లో వరదలు వచ్చేలోగా మట్టికట్టను నిర్మించాలని సూచించారు. కాలయాపన చేసి వరదలు వచ్చినప్పుడు మొత్తం కొట్టుకుపోవాలనే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలతో రైతులను ఆగం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
మ్యానిఫెస్టోల అమలుపై చర్చకు సిద్ధమా?
ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు అమలు చేయలేక ముఖ్యమంత్రిలో అసహనం స్పష్టం గా కనిపిస్తున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో అమలుపై, బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అమలుపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, సీఎం రేవంత్రెడ్డి సిద్ధమా? అని కడియం శ్రీహరి సవాల్ విసిరారు. హామీల గురించి అడిగిన వారిపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీల్లో 13 హామీ లు ఉన్నాయని, వంద రోజుల్లో అవన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రూ.2,500 సాయం హామీ నెరవేర్చలేదని, పింఛన్ను రూ.4 వేలకు పెంచలేదని విమర్శించారు. చేవెళ్ల సభలో రేవంత్రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని, సీఎం ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ, సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ ఇలా ఒకరి తర్వాత ఒకరు ఉండే కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదా? కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి కుటుం బ పాలన గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని, కాంగ్రెస్ వాళ్లు ఇంకా ఇందిరాగాంధీ నామస్మరణతోనే బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పేరుకే జాతీయ పార్టీ అని, అది ఏనాడో కుటుంబపార్టీగా, ప్రాంతీయ పార్టీ గా మారిపోయిందని విమర్శించారు. సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.
మీ అంతట మీరు కూలిపోతే మేము ఏమీ చేయలేం. రేవంత్ మాటలు తన కుర్చీని తాకొద్దని పకనున్న మంత్రులకు చెప్పినట్టుగా అనిపించింది. రేవంత్ సీఎం కుర్చీ ఇనాం కింద రాలేదు, వారసత్వంగా రాలేదు అంటున్నాడు. కచ్చితంగా సీఎం కుర్చీ నీకు ఇనాం కిందనే వచ్చింది. గాంధీ కుటుంబం రేవంత్రెడ్డికి సీఎం కుర్చీని ఇనాం కిందనే ఇచ్చినట్టు భావిస్తున్నం.
-కడియం శ్రీహరి,మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే