హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన 420 హామీల అమలుకు నిధులు ఎలా తెస్తారో చెప్పాలని బీఆర్ఎస్ సభ్యుడు కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపులు, ఎన్నికల హామీల ఖర్చులకు పొంతనే లేదని, ఈ వ్యత్యాసాన్ని పూడ్చేందుకు ప్రజలపై పన్నుల భారం వేస్తారా? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, ఎస్సీలకు అభయహస్తం, నిరుద్యోగభృతి, మహిళలకు నెలకు రూ.2,500 సహాయం, నిరుద్యోగ భృతి తదితర అంశాలను బడ్జెట్లో ప్రస్తావించలేదని ధ్వజమెత్తారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై బుధవారం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. బడ్జెట్ పుస్తకంలో రాజ్యాంగ పీఠికలు, మహానుభావుల సూక్తులను ఉటంకించారని, అసలు రాజ్యాంగ పీఠికలకు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధం ఏమిటో అర్థం కాలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియాగాంధీకి, మన్మోహన్సింగ్కు కృతజ్ఞతలు చెప్పి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కోట్లాదిమందిని, మలిదశ ఉద్యమానికి నేతృత్వం వహించిన కేసీఆర్ను మర్చిపోవడం విచారకరమని పేర్కొన్నారు.
బడ్జెట్ డొల్లగా ఉన్నదని, గత ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేసేందుకు ఎక్కువ సమయం కేటాయించారని కడియం శ్రీహరి మండిపడ్డారు. మసాలా దట్టించడం కోసం సూక్తులు రాయడం మంచిదికాదని హితవు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం కంటే బడ్జెట్ కేటాయింపులు రూ.51 వేల కోట్లు పెంచారని, వీటిని ఎలా సమకూరుస్తారని నిలదీశారు. పన్ను ఆదాయం రూ.20 వేల కోట్లు పెంచారని, ఇది ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పులపాలైందని పేర్కొంటూనే రూ.59,625 కోట్ల అప్పులు చేస్తామని చెప్పడాన్ని తప్పుబట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయకపోతే 2014-15లో రూ.1.65 లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్ నేడు రూ.2.75 లక్షల కోట్లకు ఎలా పెరిగిందని కడియం శ్రీహరి నిలదీశారు. తెలంగాణ జీఎస్డీపీ 2014-15లో రూ.5.5 లక్షలు ఉండగా, 2023లో 14.4 లక్షలకు చేరిందని, కొవిడ్ రాకుంటే రూ.18 లక్షలకు చేరేదని వివరించారు. దేశ వృద్ధి రేటు 10.5% కంటే తెలంగాణ వృద్ధిరేటు 12.7 శాతంగా ఉన్నదని చెప్పారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనత కాదా? అని ప్రశ్నించారు. తలసరి ఆదాయం రూ.3,43,207తో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉన్నదని, ఇది కేసీఆర్ విజయం కాదా? అని నిలదీశారు. 2004-05 నుంచి 2013-14 వరకు మూలధన వ్యయం రూ.54.52 వేల కోట్లు కాగా, ప్రస్తుతం రూ.3,36,916 కోట్లకు పెరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రం అప్పులపాలైందని అంటున్నారని, అయితే అప్పుల్లో తెలంగాణ దేశంలోని 29 రాష్ర్టాల్లో 23వ స్థానంలో ఉన్నదని చెప్పారు.
రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన మహిళలు 1.65 కోట్ల మంది ఉన్నారని, ఇంటికి ఒక్కొక్క మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఇచ్చినా రూ.20 వేల కోట్లు అవసరమని, బడ్జెట్లో ఈ ప్రస్తావనే లేదని కడియం మండిపడ్డారు. రూ.4 వేల చొప్పున చేయూత పెన్షన్లు ఇచ్చేందుకు రూ.24 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకు బడ్జెట్లో కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు. ఇండ్ల నిర్మాణానికి ఏడాదికి రూ.23వేల కోట్లు అవసరం కాగా రూ.7 వేల కోట్లు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు.
2014-2023 వరకు రాష్ర్టానికి రూ.2.60 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, ఐటీ ఎగుమతులు రూ. 57,258 కోట్ల నుంచి రూ.2,41,275 కోట్లకు పెరిగాయని కడియం వివరించారు. ఇటీవల ముఖ్యమంత్రి, పరిశ్రమల మంత్రి దావోస్ పర్యటన సందర్భంగా రూ.40 వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగినట్టు పేర్కొన్నారని, అందులో కొన్ని గతంలోనే ఒప్పందాలు చేసుకున్నవి ఉన్నాయని వివరించారు. తాజా ఒప్పందాలు అదనపు పెట్టుబడులకు సంబంధించినవా? లేక గతంలో చేసుకున్న ఒప్పందాలే మళ్లీ చేసుకున్నారా? అని ప్రశ్నించారు.
మేడిగడ్డ కుంగడం విచారకరమని, దీనిపై విచారణ జరిపించి దోషులపై చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. జూన్, జూలైలో వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉన్నదని, ఈలోగా మేడిగడ్డపై కాపర్డ్యామ్ నిర్మించి మరమ్మతులు పూర్తిచేయాలని కోరారు. తక్షణమే మరమ్మతు పనులు చేపట్టకపోతే వరదల వల్ల మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని హెచ్చరించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, యువత, మహిళల సంక్షేమంపై డిక్లరేషన్లు ప్రకటించినప్పటికీ వారికి కేటాయించిన నిధులు మాత్రం పెద్దగా లేవని కడియం విమర్శించారు. యువతకు రూ.4000 నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఎస్సీ, ఎస్టీలకు అభయహస్తం పేర రూ.12 లక్షల ఆర్థిక సహాయం వంటి అంశాలను బడ్జెట్లో ప్రస్తావించలేదని దుయ్యబట్టారు. బీసీ సబ్ప్లాన్ కోసం రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. బీసీ కులగణను స్వాగతిస్తామని చెప్పారు. ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, యువతకు ఇచ్చిన హామీలకు బీసీ జనగణనతో సంబంధం లేదని గుర్తుచేశారు.
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామంటున్న సీఎం, తెలంగాణ ఆనవాళ్లను చెరిపే ప్రయత్నం చేస్తున్నారని కడియం ధ్వజమెత్తారు. రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయుల కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగిస్తామని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘జయజయహే తెలంగాణ’ గీతంలో కూడా వీటి ప్రస్తావన ఉన్నదని గుర్తుచేశారు. వీటిని కేసీఆర్ నిర్మించలేదని, తెలంగాణకు గర్వకారణమని, వారసత్వ సంపద అని చెప్పారు. రాచరికపు ఆనవాళ్ల పేరుతో వీటిని తొలగించడం మంచిదికాదని హితవు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ జాతిపితగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని స్పష్టంచేశారు.
సైబర్ టవర్ ఎవరు నిర్మించారంటే చంద్రబాబునాయుడి పేరు, ఔటర్ రింగురోడ్డు అనగానే వైఎస్ఆర్ పేరు చెప్తారని, అలాగే అమరవీరుల స్మారకం, అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం, పోలీస్ కమాండ్ కంట్రోల్ తదితర వాటిని కేసీఆర్ నిర్మించారని, వీటిని ఎలా చెరిపేస్తారని ప్రశ్నించారు. కాకతీయుల కళాతోరణాన్ని తొలగించడం అంటే ప్రజలను అవమానించడమేనని చెప్పారు. హైదరాబాద్లో కలరా వచ్చినప్పుడు ప్రజలకు పని కల్పించడం కోసం చార్మినార్ను నిర్మించారని, కలరాతో చనిపోయినవారి గుర్తుగా చార్మినార్ ఉన్నదని పేర్కొన్నారు. వరసత్వ నిర్మాణాల తొలగింపుపై కాకుండా ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలుపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని హితవు చెప్పారు.
రైతు రుణమాఫీ, డిక్లరేషన్లు, అభయహస్తం కాకుండా కేవలం ఆరు గ్యారంటీలకే రూ.1.36 లక్షల కోట్లు అవసరం కాగా, బడ్జెట్లో రూ.53,196 కోట్లు మాత్రమే కేటాయించారని, ఇవి ఏ మూలకూ సరిపోవని కడియం శ్రీహరి స్పష్టంచేశారు. వచ్చే ఆరు నెలల్లో కూడా ఆరు గ్యారంటీలు అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదని అనుమానం వ్యక్తంచేశారు. ఎన్నికల కోడ్ పేరుతో కాలయాపన చేసి ప్రజలను మోసం చేయవచ్చనే ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అసెంబ్లీలో బడ్జెట్పై చర్చలో బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు పదేపదే అడ్డుతగిలారు. బీఆర్ఎస్ సభ్యుల ప్రసంగాలను అడుగడుగునా అడ్డుకుంటూ గందరగోళం సృష్టించారు. కడియం శ్రీహరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై మాట్లాడినంతసేపూ మంత్రు లు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కాంగ్రెస్ సభ్యుడు మందుల సామేల్ తదితరులు అడ్డంకులు సృష్టించారు. నిర్భందం, నియంతృత్వం గురించి బడ్జెట్ పుస్తకంలో పేర్కొన్న ప్రభుత్వం, ఎమర్జెన్సీ అంశాన్ని మాత్రం మర్చిపోయిందని కడియం శ్రీహరి వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ సభ్యులు ఒక్కకసారిగా లేచి అభ్యంతరం వ్యక్తంచేశారు.