హైదరాబాద్: మోడీ సర్కారుకు మూడిందని, దేశ్యవాప్తంగా రైతులు, దళితులు, మైనార్టీలు, సబ్బండ వర్గాలను కూడగట్టి ఢిల్లీ కోటను బద్దలు కొడతామని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్లో గురువారం నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో జీవన్రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడారు. మోడీ సర్కారు రైతాంగం ఉసురు పోసుకుంటున్నదని మండిపడ్డారు. రైతు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జీవన్రెడ్డి హెచ్చరించారు. ఢిల్లీపై దండయాత్రకు పెద్ద సంఖ్యలో కదిలివస్తామని చెప్పారు. వడ్లు కొనేదాకా తమ కొట్లాట ఆగదన్నారు.
అన్నం పెట్టే రైతులకు సున్నం పెడుతున్న బీజేపీ.. తగిన మూల్యం చెల్లించక తప్పదని జీవన్రెడ్డి పేర్కొన్నారు. పంజాబ్ కో నీతి.. తెలంగాణకు మరో నీతా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను నూకలు తినాలని అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు తగిన గుణపాఠం చెబుతామన్నారు.
రైతులను అరిగోస పెడుతున్న బీజేపీ మట్టికొట్టుకొని పోతుందని జీవన్రెడ్డి మండిపడ్డారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపుబోర్డు తెస్తానని బాండ్పేపర్ రాసిచ్చి మాటతప్పిన మోసగాడని, జిల్లాలో అతడిని తిరగనివ్వబోమన్నారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్వి అన్నీ తొండిమాటలని విమర్శించారు. టూరిస్ట్ మంత్రి కిషన్రెడ్డి ఏ గట్టున ఉంటాడో తేల్చుకోవాలన్నారు. తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని కేంద్రం కొనకుంటే..బీజేపీ నాయకులను తిరగనివ్వబోమన్నారు.