నిజామాబాద్ : రైతాంగ హామీలతో గద్దెనెక్కిన మోదీ వ్యవసాయ సేద్యానికి గోరి కడుతున్నాడని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు , ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. రైతులను బీఆర్ఎస్ అన్ని విధాల ఆదుకుంటుండగా రైతుల రాబంధు పార్టీగా బీజేపీ మారిందని ఎద్దేవా చేశారు. బీజేపీ ముమ్మాటికీ గుజరాతీ బేరగాళ్ల పార్టీయేనని విమర్శించారు.
తెలంగాణ రైతులపై మోదీ సర్కారు కక్ష గట్టిందని అన్నారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలలో ఉపాధిహామీ కింద కల్లాల నిర్మాణం జరుగుతుండగా తెలంగాణలో కల్లాల నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేయడం దారుణమని అన్నారు. ఉపాధిహామీ పథకాన్ని పార్లమెంటులో ప్రధాని మోడీ అపహాస్యం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో సాగునీటి రాకతో తెలంగాణలో సేద్యం పెరిగిందని అన్నారు.
వ్యవసాయానికి ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేయాలని బీఆర్ఎస్ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు పెంచి సాగు ఖర్చులు పెంచారని ఆరోపించారు. 60 ఏళ్లు నిండిన రైతులకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు. స్వామినాథన్ సిఫార్సులకు భిన్నంగా కొత్త ఫార్ములాను అమలుచేస్తూ మద్దతుధర ఇస్తున్నామని రైతులకు శఠగోపం పెట్టారని విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పని , సాగు చట్టాలు తెచ్చి రైతులను కార్లతో తొక్కించి,తుపాకులతో కాల్చి చంపిందని ఆరోపించారు. బీఆర్ఎస్ రైతులకు మద్దతుగా ఏర్పడ్డ పార్టీ అని వెల్లడించారు. ఈ ధర్నా కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే గణేశ్గుప్తా, జడ్పీ చైర్మన్ విట్టల్ రావు, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి , నిజామాబాద్ నగర్ మేయర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.