హైదరాబాద్: అన్నదాతల ఉద్యమంతో మోదీ సర్కార్ దిగొచ్చిందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. అద్భుతమైన చట్టాలు చేస్తే అడ్డుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూర్ఖంగా మాట్లాడాడని విమర్శించారు. ఇప్పుడు రైతులు ఎవరి మెడలు వంచారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులను అరవింద్ ఉగ్రవాదులతో పోల్చాడన్నారు. రైతులతో పెట్టుకున్నవాళ్లు ఎవరూ బాగుపడలేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ ఒక శక్తి అని, మహాధర్నాతో కేంద్రం మెడలు వంచారని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర బీజేపీ నేతలు తమ వైఖరి చెప్పాలన్నారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు కేంద్రం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ధాన్యం కొనుగోలుపై బీజేపీ, కాంగ్రెస్లకు దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు.