మహబూబ్నగర్ : రాష్ట్రం ప్రభుత్వం దివ్యాంగులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. దివ్యాంగులకు తెలంగాణ స్వర్ణ యుగంగా మారిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అభివర్ణించారు. దివ్యాంగులకు 3016 రూపాయల నుంచి 4116 రూపాయలకు పెంచిన సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగులకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెంచిన 4016 రూపాయల ప్రొసీడింగ్స్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మ రాసిన నుదిటిరాతనే తిరగరాసిన అభినవ బ్రహ్మ కేసీఆర్ అన్నారు. అంగవైకల్యం ఒక లోపం మాత్రమే. ముందుకు పోకుండా అడ్డుకునే శాపం కాదన్నారు.
లక్ష్యాన్ని సాధించడంలో వైకల్యం అడ్డురాదని నిరూపించినవారు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. దివ్యాంగుల పెన్షన్ రూ. 4016కు పెంచిన కేసీఆర్ ది చల్లని మనసన్నారు. దివ్యాంగుల అవసరాలు తెలుసుకొని వారికి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
ఒక్క పెన్షనే కాకుండా దివ్యాంగులకు సహకార సంస్థ ద్వారా అనేక సహాయ ఉపకరణాలు ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు. దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్స్లో 5 శాతం రిజర్వేషన్లు, విద్య-ఉపాధి పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు, ఉద్యోగ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారని ఆయన తెలిపారు.
బ్యాటరీ ట్రై సైకిళ్ళు, వీల్ చైర్లు, స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ అవయవాలు మొత్తం 14 రకాల వస్తువులను దివ్యాంగులకు అందిస్తున్నారని ఆయన వివరించారు.
కాగా, దేశంలోఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తం పెన్షన్లు ఇస్తున్న దాఖలాలు లేవన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు కల్లుండి చూడలేని కబోదులు. దివ్యాంగులను ఏనాడూ పట్టించుకోలేదు అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.