సూర్యాపేట : కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క రోజు పంటలు ఎండిపోలేదని మాజీ మంత్రి, సూర్యాపేట(Suryapet) ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagdish Reddy) అన్నారు. ఆదివారం ఆత్మకూర్(ఏస్) మండల పరిధిలోని రామోజీ తండా, రామన్నగూడెం గ్రామాల్లో ఎండిపోయిన వరి పొలాలను(Dry crops) పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ఒక్క గంట కరెంట్ పోలేదని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ వంద రోజుల పాలనలోనే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలనపై అవగాహన లేక ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందించలేకపోతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంట పొలాలకు నీరందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.