నల్లగొండ : కేసీఆర్ బస్సు యాత్రతో(KCR bus yatra) కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో వణుకు మొదలైంది. కేసీఆర్ పని అయిపొయింది అనుకున్న వాళ్లందరూ ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే భయపడి పోతున్నారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(MLC elections) అభ్యర్థి రాకేష్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నల్లగొండ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
గోదావరిని తీసుకెళ్లి కావేరిలో కలిపే కుట్రలు మోదీ నేతృత్వంలో మొదలయ్యాయి. దీన్ని ఆపాలంటే ఒక్క కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పక్క రాష్ట్రాల ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారు. తెలంగాణ ప్రయోజనాలు ఆ పార్టీలకు పట్టవని ఆరోపించారు. అందుకే కేసీఆర్ణు ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని గెలిపించేందుకు మోదీ సహకరించారు.
ఎంపీ ఎన్నికల్లో మోదీని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడని విమర్శించారు. గత ఎన్నికల ఫలితాల్లోనూ వీరి కుమ్మక్కు రాజకీయాలు స్పష్టం అయ్యాయని పేర్కొన్నారు. మైనారిటీలను ఓట్ల కోసమే కాంగ్రెస్ వాడుకుంటుంది. కానీ అందరి కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు.
అందుకే ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థుల గెలుపు కోసం అందరం కంకణం కట్టుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి తిరగాలి.. ప్రజలను కదిలించాలి. కాంగ్రెస్ మోసాలను వివరించాలన్నారు. రైతుబంధు ఇవాళ వచ్చిందంటే కేసీఆర్ భయమే కారణమన్నారు. మండలి ఎన్నికల్లోను గెలిపిస్తే ప్రశ్నించే గొంతుగా రాకేష్ రెడ్డి నిలుస్తాడు. నిరుద్యోగుల పక్షాన పోరాడే శక్తిగా ఉంటాడన్నారు.