సూర్యాపేట : ప్రభుత్వమే మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘటన చరిత్రలో ఏనాడు లేదని, మాట ఇచ్చి రైతన్నల నడ్డి విరిచిన అపకీర్తి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (MLAJagadish Reddy) మండిపడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అవగాహన లోపంతో ఎండిపోయిన పంటలను(Dried crops) వరసగా 5వ రోజు జగదీష్ రెడ్డి పరిశీలించారు.
ఎండిపోయిన పంటలను పరిశీలించాలని రైతన్నల కన్నీటి ఆహ్వానం మేరకు సూర్యాపేట(Suryapet) మండలం యార్కారం, దుబ్బ తండా, రేఖ్యా నాయక్ తండాలో ఎండిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎస్సారెస్పీ ఫేస్ 2 ద్వారా నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశారు. హామీ ఇచ్చి పంటలకు నీరు ఇవ్వకుండా కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేసింది దని విరుచుకుపడ్డారు.
ప్రభుత్వాన్ని నమ్మి ఒక్కో రైతు 25 నుంచి 30 వేల పెట్టుబడి పెట్టి ఆగమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అవగాహన రాహిత్యం వలన రైతులు రోడ్డు న పడ్డారని పేర్కొన్నారు. మా ప్రభుత్వం హయాంలో మొన్నటి వరకు జాలువారిన పంట పొలాలు నేడు మోడువారడానికి కారణం నూటికి నూరు శాతం ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. పంట నష్టం పై మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.