నల్లగొండ : పంటలు ఎండిపోయి రైతులు బోరున విలపిస్తున్నా పట్టించుకోని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తున్నదని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (MLA Jagadish Reddy)మండిపడ్డారు. నల్ల గొండ మండలం అన్నపర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి ఎండిన పంట పొలాలను (Crops), నిమ్మ తోటలను పరిశీలించారు. అన్నదాతలతో ముచ్చటించి వారి బాధలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మూసీ ప్రాజెక్టు కింద నీరు అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగార్జునసాగర్ ఆయకట్టులో కూడా ఎగువ ఉన్న నారాయణపురం, ఆల్మట్టి డ్యామ్ల నుంచి నీటిని తెప్పించి రైతులకి అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్లినా ఎండిన పంట పొలాలే దర్శనమిస్తున్నాయని, పెట్టుబడులన్నీ మట్టిలో కలిసిపోయి రైతులు విలపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు కూడా రైతుల వంక కన్నెత్తి చూడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా మంత్రులు కోమటిరెడ్డి,ఉత్తమ్ ఉత్తరకుమారులని, ప్రగల్బాలు పలకడం తప్పా దేనికి పనికిరారని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం కరువుపై సర్వే చేయించి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, చెరుకు సుధాకర్, పంకజ్ యాదవ్, దీప వెంకట్ రెడ్డి, యాదయ్య గౌడ్, నాగరాజు, దేవేందర్, లింగుస్వామి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.