Jagadish Reddy | సూర్యాపేట : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎండిన పొలాలను పరిశీలించేందుకు ఒక్క రోజు బయటకు వస్తేనే కాంగ్రెస్ నాయకుల లాగులు తడిసిపోయాయి.. అలాంటి నేతలు ఒకర్ని మించి ఒకరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఖబడ్దార్.. కేసీఆర్ జోలికి వస్తే బొంద పెడుతాం. కేసీఆర్ను ఒక్క మాట అన్న సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. సూర్యాపేటలో నిర్వహించిన నల్లగొండ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
రేవంత్ రెడ్డికి పాలన చేయడం చేతకాక.. అక్రమ కేసులతో ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తున్నారు. సాగర్ డెడ్ స్టోరేజ్లో కూడా ఆయకట్టుకు కేసీఆర్ నీళ్లు ఇచ్చి పంటలను కాపాడిన ఘనత కేసీఆర్ది అని తెలిపారు. ఇప్పుడేమో వ్యతిరేక మీడియా కేసీఆర్పై విషం చిమ్ముతున్నది. కాళేశ్వరంలో మూడు పిల్లర్లు కుంగితే కేసీఆర్ తప్పు ఎలా అవుతుంది..? ఇప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు లిఫ్ట్ చేసి సాగుకు అందించొచ్చు. కేసీఆర్కు ఎక్కడ ఆదరణ వస్తుందోననే భయంతో కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ సూర్యాపేటలో ఎండిపోయిన పంటలను పరిశీలించగానే, కాంగ్రెస్ నేతల లాగులు తడిసిపోయాయి. వెంటనే కాళేశ్వరం బాహుబలి మోటార్లు అన్ చేసి నీళ్లు ఇచ్చారని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు.
రుణమాఫీ చేయకుండా అన్నదాతలను నట్టేట ముంచారని మండిపడ్డారు. ఇందుకేనా మీకు ప్రజలు ఓట్లు వేసింది.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలి. కాంగ్రెస్ వాళ్లకు అహంకారం, అధికార మదం ఎక్కువ అయింది. కేసీఆరే లేకుంటే తెలంగాణ వచ్చేదా..? కేసీఆర్ వల్లనే కాంగ్రెస్ వాళ్లకు పదవులు వచ్చాయి. కాంగ్రెస్ చేతకాని తనం వల్లనే నాగార్జున సాగర్ డ్యామ్ కేంద్రం పరిధిలోకి వెళ్ళింది. కేసీఆర్ కన్నెర్ర జేస్తే అప్పటికప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టారని జగదీశ్ రెడ్డి తెలిపారు.