హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ(Congress party) హామీలను ప్రజలు నమ్మరని, ఆరు గ్యారంటీల(Six guarantees) పేరుతో అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో(Telangana Bhavan) మీడియా సమావేశంలో ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. మహిళలకు రూ.2500 ఇస్తామనే హామీని మరిచిపోయారు. మళ్లీ ఇప్పుడు మహిళలకు లక్ష రూపాయలు ఇస్తామని తెలంగాణ వేదికగా మరో మోసానికి తెరలేపుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలు నీటి మూటలని తేలిపోయిందన్నారు. పార్టీ ఫిరాయింపు దారులను పక్కన పెట్టుకుని కాంగ్రెస్ నీతులు చెబుతుందని విమర్శించారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆగం చేశారని ఆరోపించారు. పదేండ్లు కష్టపడి కేసీఆర్ వ్యవసాయాన్ని నిలబెడితే మూడు నెలల్లోనే వ్యవసాయాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ వస్తున్నారని ప్రాజెక్టులకు నీళ్లు వదిలారు.
కేసీఆర్ వస్తుంటే కాంగ్రెస్ నాయకులు లాగులు తడిసినయని ఎద్దేవా చేశారు. ఇన్ని రోజులు నీళ్లు లేవు అన్నారు. అప్పుడు లేని నీళ్లు ఇప్పుడు ఎలా వచ్చాయని? ప్రశ్నించారు. నీళ్లు ముందే వదిలి ఉంటే పంట లను రైతులు కాపాడుకునే వారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్లో ఇంతకంటే తక్కువ నీళ్లు ఉన్నప్పుడు కూడా సాగుకు నీళ్లు ఇచ్చామని గుర్తు ఆయన చేశారు.
రైతుబంధు అడ్డుకోబోమని, రైతుల ప్రయోజనాలే ముఖ్యమని కేసీఆర్ చెప్పారు. రైతుబంధును ఇవ్వకుండా ఎవరు అడ్డుకోరు. వెంటనే అందరికి రైతుబంధు అందించాలన్నారు. వంద రోజుల నుంచి ఇక్కడ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారని విమర్శించారు. కుర్చీని కాపాడుకునేందకు కాంగ్రెస్ మంత్రులు కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు.
నిన్నటి తుక్కుగూడ కాంగ్రెస్ మీటింగ్లో రైతుల ప్రస్తావనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో మార్పు కొత్తగా ఉంటుందని ప్రజలు భ్రమపడ్డారు. 2014 ముందటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.