సూర్యాపేట : ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC election) పట్టభద్రులు ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. శుక్రవారం సూర్యాపేట(Suryapet) జిల్లా కోర్టుల ఆవరణలో బార్ అసోసియేషన్ న్యాయవాదులను (Lawyers) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి గత ప్రభుత్వ పథకాలను కూడా కొనసాగించడం లేదని విమర్శించారు.
తొమ్మిదేళ్ల పాలనలో ప్రతి ఒక్కరిని ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది అన్నారు. రాష్ట్రంలో ఐదు నెలలు అధికారంలో ఉండి విద్యుత్ నిర్వహణను ఆగం చేశారని విమర్శించారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని దాటవేస్తున్నారు. రైతు పండించిన పంటకు బోనస్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఓటు వేస్తున్నామంటే మన గొంతును అభ్యర్థికి ఇస్తున్నట్లేనని స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతు ప్రశంసించే గొంతుగా మారిందని, అందుకే ప్రశ్నించే గొంతుక ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.