Rythu Bandhu | మహబూబాబాద్, డిసెంబర్ 29 నమస్తే తెలంగాణ: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సోదరుడి దశదిన కార్యక్రమానికి వెళ్లిన మాజీ మంత్రి హరీశ్రావుకు ఊహించని పరిణామం ఎదురైంది. ఓ రైతు ఆయన దగ్గరికి వచ్చి అన్నా.. రైతుబంధు రాలేదని మొర పెట్టుకోవటం కనిపించింది. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్ద తండాలో శుక్రవారం సత్యవతి సోదరుడు గుగులోత్ కిషన్ నాయక్ దశదిన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హరీశ్రావు, మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్నాయక్, హరిప్రియ, పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకటరమణరెడ్డి హాజరై నివాళి అర్పించారు. కిషన్ నాయక్ కుటుంబసభ్యులను పరామర్శించి, ఇంటి బయటికి వస్తుండగా, ఒక్కసారిగా పెద్ద కేక వినిపించింది.
హరీశ్ అన్నా! అని ఓ రైతు గట్టిగా అరిచాడు. ఎవరా? అని అంతా అటువైపు చూశారు. ఆ వ్యక్తి హరీశ్రావు దగ్గరికి వచ్చి దీనంగా.. ‘అన్నా! ఇంకా రైతుబంధు పడలే. పెట్టుబడికి ఇబ్బంది అవుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు పంటలకు ఠంచనుగా పెట్టుబడి సాయం పడేది. ఇప్పుడు ఇంకా పడలే’ అని వివరించాడు. రైతు బాధను అర్థం చేసుకున్న హరీశ్రావు.. ఏమీ అనకుండా సైలెంట్గా ఉండిపోయారు. హమీ ఇద్దామంటే అధికారంలో లేరు, ప్రభుత్వంపై విమర్శలు చేద్దామంటే సరైన సమయం కాదని.. ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఈ సందర్భంగా దశదిన కర్మకు వచ్చినవాళ్లంతా రైతుబంధు ఇంకా రాలేదన్న అంశంపైనే చర్చించుకోవటం కనిపించింది. దీనిపై వీరన్నను ‘నమస్తే తెలంగాణ’ ఆరా తీయగా.. తనకు ఐదెకరాల భూమి ఉన్నదని, ఏటా వానకాలం, యాసంగిలో రెండు పంటలకు కేసీఆర్ ప్రభుత్వం సమయానికి రైతుబంధు ఇచ్చేదని తెలిపాడు. ప్రభుత్వం మారిన తరువాత ఇప్పటివరకూ రాలేదని తన ఇబ్బందిని వివరించాడు. ఐదెకరాల్లో రెండెకరాల్లో పొలం, మూడెకరాల్లో మిర్చి తోటను సాగు చేస్తున్నట్టు వెల్లడించాడు. ఐదు ఎకరాలకు ఈ సీజన్లో రూ.25,000 రావాల్సి ఉండగా, నయాపైసా రాలేదని చెప్పాడు. పనిచేసే ప్రభుత్వం రానందుకు ప్రతి ఒక్క రైతు బాధపడుతున్నాడని ఆవేదన వెలిబుచ్చాడు.