హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఎక్స్ వేదికగా కోరారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. పంటలు చేతికొచ్చే సమయంలో వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చిందని పేర్కొన్నారు.
వరి, మకజొన్న, జొన్న పంటలతోపాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. గతంలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే, అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించి, అకడికకడే ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం ప్రకటించి అమలు చేశారని గుర్తుచేశారు. రెండు, మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయాలు తప్ప, రైతు ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేలొని అన్నదాతకు అండగా నిలవాలని హితవు చెప్పారు. పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయడంతోపాటు ఎకరాకు రూ.10 వేల నష్ట పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నదని తెలిపారు.