సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో జరిగిన రోడ్షోలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్రావు, పక్కన కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్ తదిరులు
సిద్దిపేట/నల్లగొండ ప్రతినిధి, హుస్నాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు వస్తా అన్నడు. ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా. ఇవ్వాళ కూడా నా మాట మీద నిలబడుతున్న. వంద రోజుల్లో అమలుచేస్తామని బాండ్పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయండి. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయండి.నేనే స్వయం గా శాలువా కప్పుతా. సిద్దిపేటకు సీఎంను స్వయంగా నేనే స్వాగతిస్తా. నా రాజీనామాను ఆమోదించుకుంటా’..అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘పంద్రాగస్టుకైనా ఆరు గ్యారెంటీలు,రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని స్పష్టంగా చెప్పాలి. దానికి నువ్వు (సీఎం రేవంత్రెడ్డి) సిద్ధమా? ఆరు గ్యారెంటీలు అమలు చేసి, రుణమాఫీని పంద్రాగస్టులోపు చేస్తే నేనే స్వచ్ఛందంగా స్పీకర్ దగ్గరికి వెళ్లి స్పీకర్ ఫార్మాట్లో నా రాజీనామాను ఆమోదించుకోవటానికి సిద్ధం. మళ్లీ ఎన్నికల్లో పోటీచేయను. నువ్వు రాజీనామాకు సిద్ధమా? ఒకవేళ చేయకపోతే కొడంగల్ చౌరస్తాలో ముక్కునేలకు రాస్తవా?’ అని ప్రశ్నించారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డికి తన రాజీనామాను పంపిస్తానని, రేవంత్ కూడా పంపాలని డిమాండ్ చేశారు. ‘డొంక తిరుగడు .. డొల్ల మాటలు వద్దు.. నేను చేసిన చాలెంజ్ను స్వీకరించాలని మళ్లీ అడుగుతున్నా. ఇప్పటిదాకా నా చాలెంజ్ను స్వీకరించలేదు.సొల్లు మాటలు మాట్లాడుతున్నారు. సంగారెడ్డిలో చాలెంజ్ చేసినప్పటి నుంచి నేను ఒకే స్టాండ్ మీద ఉన్నా. మీరు ఏ వీడియో క్లిప్పింగ్ చూసినా, పబ్లిక్ మీటింగ్ చూసినా ఇదే కనిపిస్తుంది. నీ లెక్క పదవుల కోసం పార్టీలు మార్చుడు, అబద్ధాలు ఆడటం, చిల్లర రాజకీయాలు చేయటం నాకు రాదు. విలువలతో కూడిన రాజకీయాలు చేయటమే నాకు అలవాటు’ అని స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకు మేలు జరగటమే సంతోషమని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీ కొత్త నాటకం
కేసీఆర్ బస్సుయాత్ర సూపర్ హిట్ కావటంతో బీజేపీ, కాంగ్రెస్ కొత్త నాటకానికి తెర తీశాయని హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ లేకుండా చేయాలన్నదే ఈ రెండు పార్టీల కుట్ర అని విమర్శించారు.కాంగ్రెస్కు ఓటేస్తే హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచుతారని ప్రధాని మోదీ, బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని, ఇవి రెండు జరగవని స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, గుజరాత్కు పోటీ అంటూ రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెర తీశారని హరీశ్ అన్నారు. ‘ఏనాడు జై తెలంగాణ అనలేదు, ఒక్కరోజూ అమరవీరుల స్థూపం వద్ద రెండు పూలు పెట్టలేదు. నువ్వు కూడా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతావా?’అని రేవంత్పై విమర్శలు ఎక్కుపెట్టారు. రేవంత్ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఉండగా రిజర్వేషన్లు పోతాయా? ఇంత పెద్ద నాయకుడు ఉండగా, ఇంత పెద్ద భారత రాజ్యాంగం ఉండగా, రిజర్వేషన్లు మారితే ఆ ప్రభుత్వం ఉంటదా? అని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ నాయకులు రాజనర్సు, రవీందర్రెడ్డి, సంపత్రెడ్డి, సాయిరాం, వేణుగోపాల్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, సోంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ లక్ష తులాల బంగారం బాకీ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లక్ష పెండ్లి ళ్లు జరిగాయని, అంటే.. ఆడబిడ్డలకు రేవంత్ సర్కార్ లక్ష తులాల బంగారం బాకీ పడ్డదని మాజీమంత్రి హరీశ్రావు తెలిపారు. శుక్రవారం భువనగిరి లోక్సభ స్థానం పరిధిలోని చండూరులో, నల్లగొండ పార్లమెంట్ స్థానం పరిధిలోని నల్లగొండలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థులు క్యామ మల్లేశ్, కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి రోడ్షోల్లో హరీశ్రావు ప్రసంగించారు. అధికారం అహంకారంతోనే మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రైతుబంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టాలని అంటున్నారని మండిపడ్డారు. వాళ్ల అహంకారం దింపాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలి పించాలని పిలుపునిచ్చారు. బాండ్పేపర్లకు, దేవుళ్లపై ఒట్లకు మోసపోదామా? అని ప్రశ్నిం చారు. రాజగోపాల్రెడ్డి తన మంత్రి పదవి కోసం భువనగిరి ప్రజలను తాకట్టు పెట్టేందు కు సిద్ధ్దమయ్యారని ఆరోపించారు. రోడ్షోల్లో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, ప్రభాకర్రెడ్డి,భూపాల్రెడ్డి, లింగయ్య, తిప్పన విజయసింహారెడ్డి, రాష్ట్ర నేతలు పాల్వాయి స్రవంతి, చెరుకు సుధాకర్, పల్లె రవికుమార్, మల్లికార్జున్రెడ్డి, సైదిరెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేసేందుకు బాబు, కాంగ్రెస్ కుట్ర
హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేసేందుకు చంద్రబాబు, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని మాజీమంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఇలా జరిగితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది జరగకుండా ఉండాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఎక్కువ మంది పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో శుక్రవారం జరిగిన రోడ్షోలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని, ఆయన పాలనలోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారని వెల్లడించారు. పల్లెలు, పట్టణాల్లో ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని, ఈసారి బీఆర్ఎస్ ఎక్కువ సంఖ్యలో ఎంపీ సీట్లు గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి కాముకుడైన వినోద్కుమార్ను గెలిపించాలని, కారు గుర్తుకు ఓటు వేసి తెలంగాణకు పూర్వవైభవం తేవాలని ప్రజలను కోరారు. వినోద్కుమార్ మాట్లాడుతూ.. అభివృద్ధి అంటే గులాబీ జెండా అని, విధ్వంసం అంటే కాంగ్రెస్, బీజేపీ అని ఎద్దేవా చేశారు. కరీంనగర్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం పాటుపడే తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రోడ్షోలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ హుందాగా మాట్లాడితే మంచిది
‘రేవంత్రెడ్డి.. మీరు సీఎం హోదాలో ఉన్నారు. గౌరవంగా మాట్లాడితే, హుందాగా ఉంటే రాష్ర్టానికి మంచిది’ అని హరీశ్రావు చురక అంటించారు. బీఆర్ఎస్పై బురద చల్లాలన్న పిచ్చి ప్రయత్నంతో రేవంత్ చేసిన అసందర్భ వ్యాఖ్యల వల్ల రాష్ర్టానికి పెట్టుబడులు రాకుండా పోయాయని విమర్శించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలైందని ఆరోపించారు. బిడ్డ పెండ్లి పెట్టుకున్నామని, భూమి అమ్ముదామంటే ఎవరూ కొనడానికి ముందుకు రావటం లేదని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లికి చెందిన ఒక మహిళ తనతో గోడు వెళ్లబోసుకొన్నదని వెల్లడించారు.