జనవరి 17న జరిగిన కృష్ణాబోర్డు సమావేశంలో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను నెల రోజుల్లో అప్పగిస్తామని ఒప్పుకొని రాష్ట్రప్రభుత్వం సంతకాలు చేసి వచ్చింది. బోర్డు నిర్వహణకు ఏపీ, తెలంగాణ రెండు రాష్ర్టాలు సిబ్బందిని కేటాయించాలని.. వారి జీతభత్యాలను ఆయా రాష్ర్టాలే భరించాలని మినిట్స్లో స్పష్టంగా ఉన్నది. ఒకవేళ ప్రాజెక్టుల అప్పగింతకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే.. సిబ్బంది డిప్యూటేషన్లు, జీతాల ప్రస్తావన ఎందుకు వస్తుంది?
– అసెంబ్లీలో హరీశ్
Harish Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం సాయంత్రం ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. సీఎం రేవంత్రెడ్డి, మాజీ మంత్రి హరీశ్రావు మధ్య జరిగిన సంవాదం ఆసక్తికరంగా మారింది. హరీశ్రావు అడిగిన అనేక ప్రశ్నలకు సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పలేకపోయారు. తాము అధికార పక్షంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాడుతామని హరీశ్రావు స్పష్టంచేశారు. ‘వ్యంగ్యం తగ్గించుకోండి.. వ్యవహారంపై దృష్టి పెట్టండి’ అని సీఎంకు సూచించారు. వ్యంగ్యం ఎక్కువైందని, వ్యవహారం తగ్గిందని చురకలంటించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ఇవ్వడం అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేశామని గుర్తుచేశారు. ఇప్పుడు పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో శాసనసభలో కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని, పీవీ గౌరవాన్ని పెంచాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పీవీని పట్టించుకోకపోయినా కేసీఆర్ ప్రభుత్వం పీవీ ఘాట్ నిర్మించిందని, అసెంబ్లీలో పీవీ చిత్రపటం ఏర్పాటు చేసిందని, శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిందని, పీవీ కుమార్తె వాణీదేవికి ఎమ్మెల్సీ ఇచ్చామని గుర్తుచేశారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడటానికి అవసరమైనంతసేపు మైక్ ఇస్తామని బయట చెప్తున్నారని, సభలో మాత్రం అడిగీ.. అడిగీ గొంతు నొప్పి పెట్టినా ఇవ్వడంలేదని విమర్శించారు. హరీశ్రావు తన ప్రసంగం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డికి అనేక ప్రశ్నలు సంధించగా ఆయన నుంచి సమాధానం రాలేదు.
సీఎం వ్యాఖ్య: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నన్ను కలవడానికి వస్తే ఆ పార్టీ నాయకత్వం వారిని అనుమానిస్తున్నది. చివరికి ప్రెస్మీట్లు పెట్టించి, వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
హరీశ్ కౌంటర్: నమ్మకం లేనిది మా రాష్ట్ర నాయకత్వానికి కాదు. మీ ఢిల్లీ అధిష్ఠానానికి. అందుకే మీరు ఇటీవల ఢిల్లీకి ప్రధానిని కలిసేందుకు వెళ్లిన ప్రతిసారీ వెంట డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు.
సీఎం నుంచి సమాధానం రాలేదు
సీఎం వ్యాఖ్య: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గత నెలలో 4వ తేదీలోగా జీతాలు ఇస్తే.. ఈసారి మొదటి తేదీనే జీతాలు ఇచ్చినం.
హరీశ్ కౌంటర్: ఒకటో తేదీన జీతాలు ఇచ్చారనడం సత్యదూరం. ఏడో తేదీన కూడా జీతాలు పడ్డాయి. ఈరోజు (శుక్రవారం) ఉదయం కాంట్రాక్ట్ లెక్చరర్లు వచ్చారు. రెండు నెలలుగా జీతాలు రాలేదని, అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు. 12,660 ఈజీఎస్ ఉద్యోగులకు, వేలమంది ఐకేపీ, వీవోఏలకు, దవాఖానల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు, సర్వశిక్షా అభియాన్లో కాంట్రాక్ట్ సిబ్బందికి ఇప్పటివరకు జీతాలు పడలేదు.
సీఎం నుంచి సమాధానం రాలేదు
సీఎం వ్యాఖ్య: రాష్ట్రంలోని దాదాపు 80 శాతం మంది పెన్షనర్లకు ఇప్పటికే పెన్షన్ అందించాం.
హరీశ్ కౌంటర్: రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలలో ఆసరా పెన్షన్లు ఇవ్వలేదు. ఆ పెన్షన్ ఫిబ్రవరిలో ఇస్తున్నారు. అంటే జనవరిలో పడాల్సిన పెన్షన్ను ఎగ్గొట్టారు.
సీఎం నుంచి సమాధానం రాలేదు
సీఎం వ్యాఖ్య: రైతుబంధు డబ్బులను గతంలో ఐదారు నెలలపాటు రైతులకు వేసేవారు.
హరీశ్ కౌంటర్: ఈ ప్రకటనలో కొంత సత్యం, కొంత అసత్య ఉన్నది. మా హయాంలో రూ.7,500 కోట్లు రైతుబంధు వేయాల్సి ఉంటే చిన్న రైతులందరికీ దాదాపు రూ.6 వేల కోట్లు మొదటి నెలలోనే వేశాం. కానీ కాంగ్రెస్ హయాంలో రెండుమూడు వందల కోట్ల నుంచి మొదలుపెట్టారు. చాలా ఎక్కువగా పెండింగ్ ఉన్నాయి.
సీఎం నుంచి సమాధానం రాలేదు
సీఎం వ్యాఖ్య: కొందరికి రూ.100 పెట్టి పెట్రోల్ కొనడానికి డబ్బులు ఉంటాయి కానీ అగ్గిపెట్టె కొనుక్కోవడానికి రూపాయి కూడా ఉండదు.
హరీశ్ కౌంటర్: ఆనాటి భావోద్వేగాలు ఉద్యమకారులకు అర్థం అవుతాయి. రేవంత్ ఏనాడూ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించలేదు. అమరవీరుల కుటుంబాలను పరామర్శించలేదు.. ఒక్కరి పాడె మోయలేదు. ఉద్యమకారుల మీదికి తుపాకులు పట్టుకొని పోయినవారికి అమరవీరుల గురించో, తెలంగాణ ఉద్యమం గురించో తెలుస్తుందని అనుకోను. అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులాగా అగ్గిపెట్టె ముచ్చట ఇక బంద్ చేయండి. తెలంగాణ పోరాటంలో నా ప్రయత్నాన్ని కించపరిచి తగ్గిస్తామంటే మీ విజ్ఞతకు వదిలేస్తున్నా.
సీఎం నుంచి సమాధానం రాలేదు
సీఎం వ్యాఖ్య: బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్ను కిలోమీటర్న్నర మాత్రమే తవ్వింది.
హరీశ్ కౌంటర్: సీఎం మొన్న ప్రెస్మీట్లో కిలోమీటర్ అన్నారు. ఇప్పుడు కిలోమీటరున్నర అంటున్నారు. ముందుగా మీరు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోండి. మా హయాంలో 11 కిలోమీటర్లు తవ్వాం.
సీఎం నుంచి సమాధానం రాలేదు
సీఎం వ్యాఖ్య: శ్రీశైలం, నాగార్జునసాగర్, పెద్దవాగు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే డిపాజిట్ కింద జమ చేసేందుకు రూ.200 కోట్ల చొప్పున 2023-24లో బడ్జెట్లో కేటాయించారు.
హరీశ్ కౌంటర్: రూ.200 కోట్లు కేవలం ప్రతిపాదనలే. ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. మేము కేఆర్ఎంబీకి కొన్ని షరతులు పెట్టాం. అవి ఒప్పుకుంటేనే ప్రాజెక్టులు అప్పగిస్తామని స్పష్టంచేశాం. కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీకి సగంసగం ఇవ్వాలని, పోతిరెడ్డిపాడుకు 34 టీఎంసీలకు మించి ఒక్క చుక్క ఎక్కువ ఇవ్వొద్దని, శ్రీశైలం ఎండీడీఎల్ 830 అడుగులు మెయింటెయిన్ చేయాలని, తాగునీటిలో 20 శాతమే అకౌంటబిలిటీ చేయాలని షరతులు పెట్టాం. వాళ్లు ఒప్పుకోలేదు.. మేం నయాపైసా విడుదల చేయలేదు.
సీఎం నుంచి సమాధానం రాలేదు
సీఎం, నీటిపారుదల శాఖ మంత్రుల వ్యాఖ్య: మా ప్రభుత్వం ఏర్పడి కేవలం 60 రోజులు అయ్యింది. ఈ సమయంలో ప్రాజెక్టుల గురించి మమ్మల్ని ఎవరూ మీటింగ్లకు పిలువలేదు. మేం ఎక్కడికీ వెళ్లలేదు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించేందుకు గత ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నది. మేం ప్రాజెక్టులను ఎవరికీ అప్పజెప్పలేదు, అప్పజెప్పబోము. ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదువుతున్నారు.
హరీశ్ కౌంటర్: ఈ మినిట్స్ కేంద్రం స్వయంగా విడుదల చేసినవి. ప్రాజెక్టుల అప్పగింతపై జనవరి 17వ తేదీ, ఫిబ్రవరి 1వ తేదీన సమావేశాలు జరిగాయి. 17న జరిగిన సమావేశంలో నాగార్జునసాగర్, శ్రీశైలంను నెల రోజుల్లో అప్పగిస్తామని ఒప్పుకొని సంతకాలు చేసివచ్చారు. బోర్డు నిర్వహణకు రెండు రాష్ర్టాలు సిబ్బందిని కేటాయించాలని, వారి జీతభత్యాలను ఆయా రాష్ర్టాలే భరించాలని మినిట్స్లో స్పష్టంగా ఉన్నది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకుంటే సిబ్బంది డిప్యూటేషన్లు, జీతాల ప్రస్తావన ఎందుకు వస్తుంది? అప్పుడు ఒప్పుకొని.. ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలెక్క గిలగిల కొట్టుకుంటున్నరు. తప్పయిపోయింది.. తెలిసో తెలియకో ఒప్పుకున్నాం, మేం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్తే సహకరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.
సీఎం నుంచి స్పందన లేదు.
సీఎం, నీటిపారుదల శాఖ మంత్రుల వ్యాఖ్య: తెలంగాణ పరిధిలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఏపీ పోలీసులు వచ్చి ఆక్రమిస్తే మీ ప్రభుత్వం చేష్టలుడిగి చూసింది.
హరీశ్ కౌంటర్: నాగార్జునసాగర్ను ఏపీ పోలీసులు పోలింగ్ జరిగే రోజు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు శాంతిభద్రతల అంశం ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే ఉన్నారు. మరి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలైనా ఇంకా నాగార్జునసాగర్ ప్రాజెక్టు సీఆర్పీఎఫ్ పోలీసుల భద్రతలోనే ఎందుకు ఉన్నది? వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదీనంలోకి తీసుకోవాలి. రమ్మంటే మేం వెంట వస్తాం. సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం.
ఇద్దరి నుంచి సమాధానం లేదు.