హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ చేసిన ప్రసంగం అర్ధ సత్యాలతో అత్యంత పేలవంగా ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ హామీల అమలుపై వేయి కండ్లతో ఎదురుచూస్తున్న ప్రజలు గవర్నర్ ప్రసంగంతో భంగపడ్డారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేయించిన గవర్నర్ ప్రసంగంలో విజన్ లోపించిందని విమర్శించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. నెలకు రూ.4 వేల పింఛన్పై ప్రకటన కోసం ఎదురుచూసిన వృ ద్ధులు, దివ్యాంగులు, నెల కు రూ.2,500 అమలు ప్రకటనపై ఆశపడ్డ మ హిళలు, రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రూ. 500 బోనస్ ప్రకటనపై రైతులు, రూ.4వేల నిరుద్యోగ భృతిపై నిరుద్యోగులు వేయి కండ్లతో ఎదురుచూసి భంగపడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. పల్లెలు, పట్టణ ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై ప్రకటన చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు.
గవర్నర్ ప్రతిష్ఠను దిగజార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెతో అర్ధ సత్యాలు చదివించిందని హరీశ్రావు మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల్లో రెండు అమలు చేశామడం దారుణమని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల్లో మొత్తం 13 హామీలు ఉన్నాయని గుర్తుచేశారు. వాటిల్లో ఉచిత బస్ ప్రయాణమే అమలు చేస్తున్నారని చెప్పారు. త్వరలో 200 యూనిట్లకు గృహజ్యోతి, రూ.500కు గ్యాస్సిలిండర్ పథకం అమలు చేస్తామనే చెప్పారని, ఈ మాత్రానికి ఆరు గ్యారెంటీల్లో రెండు అ మలు చేసినట్టు చెప్పుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలను ఎప్పటికల్లా అమలు చేస్తారో చెప్పకపోవడం దారుణమని అన్నారు.
డిసెంబర్ 9న ప్రమాణం చేస్తామని, అదే రోజు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల వేళ రేవంత్రెడ్డి చెప్పిన విషయాన్ని హరీశ్రావు గుర్తుచేశారు. ప్రమాణస్వీకారాన్ని 7వ తే దీకి ముందుకు జరుపుకొని, ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం వాయిదా వేస్తున్నారని ఎద్దేవా చేశారు. నాడు ప్రమాణస్వీకారాన్ని ముందుకు జరపడంలో ఉన్న ఆతృత, ప్రేమ.. రైతులకు రుణమాఫీ, పంటలకు రూ.500 బో నస్ ధర, ఆసరా పింఛన్లు రూ.4 వేలకు పెంచడంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 60 రోజులు అవుతున్నదని, వారు కోరిన వంద రోజుల గడువుకు ఇంకా 40 రోజులే మిగిలి ఉన్నాయని గుర్తుచేశారు. మరో 15 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉన్నదని, కోడ్ వస్తే హామీల అమలు ఎలా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం రూ.500 గ్యాస్, 200 యూనిట్ల కరెంటు అమలు చేస్తే, మిగిలిన హామీలు ఈ ఏడాది అమలు చేయనట్టేనా? అని నిలదీశారు.
కాంగ్రెస్ వస్తే రైతులకు మేలు చేస్తామన్న నాయకులు వారిపై కనీసం శ్రద్ధ చూపడం లేదని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతుభరోసా ఇస్తామని చెప్పి తామిచ్చిన రూ.10 వేలను సైతం ఇవ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. వడ్లు అమ్మొద్దని, అధికారంలో రాగానే ఇస్తామన్న రూ.500 బోనస్ ఏమైందని ప్ర శ్నించారు. రైతులకు తాము 24 గంటల ఉచిత కరెంటు ఇస్తే, ఇప్పుడు 15 గంటలు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి దావోస్ వెళ్లి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్తున్నారని, ఎవరెవరు ఎంతెంత పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారో శ్వేతపత్రం విడుదల చేసి, ప్రజలకు నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను 90% పూర్తి చేసిందని హరీశ్రావు చెప్పారు. దానిని సకాలంలో పూర్తి చేస్తే 4 వేల మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ పవర్ప్లాంట్ గురించి కూడా గవర్నర్ ప్రసంగంలో లేదని మండిపడ్డారు. మూసీ నది ప్రక్షాళనకు కేసీఆర్ హయాంలోనే రూ.3,500 కోట్లతో 52 ఎస్టీపీలు ఏర్పాటు చేశామని, వాటి ద్వారానే మురికి నీరు మూసీకి రావడం లేదని వివరించారు. నాటి పనుల ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో లేదని పేర్కొన్నారు. ఉద్యోగులకు 7వ తేదీ దాటినా వేతనాలు రాలేదని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, మాణిక్రావు, కొత్త్త ప్రభాకర్రెడ్డి, చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.
ప్రగతిభవన్ పేరు మార్చి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం తుస్సుమన్నదని హరీశ్రావు ఎద్దేవా చేశారు. ప్రతిరోజూ ప్రజల నుం చి ఫిర్యాదులు స్వీకరిస్తానన్న సీఎం రేవంత్రెడ్డి మొదటిరోజులోని మొదటి గంట మినహా మళ్లీ అటువైపు వెళ్లలేదని మండపడ్డారు. మంత్రులు కూడా రెండు రోజుల కంటే ఎక్కు వ రాలేదని, ఆ తర్వాత మరో వారం రోజు లు ఐఏఎస్ అధికారులు దరఖాస్తులు తీసుకున్నారని, ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తులను ప్ర జాభవన్ వేదికగా ఔట్సోర్సింగ్ సిబ్బంది తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మంగళవారం, శుక్రవారమే దరఖాస్తులు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ హయాంలో గ్రీవెన్స్ నిర్వహించి అధికారుల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించామని చెప్పారు.