హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే సీఎం రేవంత్రెడ్డి కొత్త హామీలు ఇస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్పై రాష్ట్ర ప్రజలు నమ్మకం కోల్పోయారని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. ‘పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పుడు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని చెప్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకుముందు డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని ప్రకటించి, మాట తప్పినందుకు రేవంత్రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి.
రుణమాఫీ కోసం బీఆర్ఎస్ చేసిన పోరాటానికి భయపడే సీఎం ఈ ప్రకటన చేశారు. ఎకరానికి రూ.15వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంకా ఎందుకు అమలు చేయడం లేదు? వ్యవసాయ కూలీలకు 12వేలు ఇస్తామని నమ్మబలికి, అధికారంలోకి వచ్చాక ఎందుకు ఇవ్వడం లేదు? మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు ప్రతినెలా 2500 ఇస్తామన్న హామీ ఏమైంది? రూ.4 వేలకు పెంచుతామన్న పింఛన్లు ఎప్పటినుంచి ఇస్తారు? ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధిలేని కాంగ్రెస్ ప్రభుత్వం.. కేవలం ఓట్ల కోసమే పాత హామీలను కొత్తగా ఇస్తున్నది. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే హామీలకు కొత్త తేదీలు ప్రకటిస్తున్నది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్పై నమ్మకం కోల్పోయారు’ అని సీఎం రేవంత్రెడ్డిపై ఎక్స్వేదికగా ఫైర్ అయ్యారు.