సిద్దిపేట : సిద్దిపేట(Siddipet) జిల్లా రైతంగానికి యాసంగి పంటకు నీళ్లు(irrigation water) అందించాలని, అందుకు అవసరమైన నీటిని మిడ్ మానేర్ నుంచి రంగనాయక సాగర్కి నీటిని పంపు చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumareddy)కి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) లేఖ రాశారు. ఈ మేరకు శనివారం శాసన సభలో మంత్రిని కలిసి లేఖను అందజేశారు. సిద్దిపేట జిల్లా రైతాంగ ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెలుతున్నట్లు చెప్పారు.
గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో సాగు భూములకు రంగనాయక సాగర్ ద్వారా సాగునీరు అందజేశామన్నారు. ఈ యేడు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో యాసంగి పంటకు సరిపోయే నీరు రిజర్వాయర్లో లేక రైతాంగం ఆందోళనకు గురవుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వెంటనే మిడ్ మానేరు నుంచి 1.50 టీఎంసీల నీళ్లు రంగనాయక సాగర్కు వచ్చే విధంగా పంపింగ్ చేయాలని లేఖ ద్వారా మనవి చేశారు. నీటి పారుదల శాఖ మంత్రిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.