Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తారీఖున జీతాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అసత్యం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. పలు శాఖల్లో ఏడో తారీఖు వరకు కూడా జీతాలు పడ్డాయి. ఇప్పటికీ కొన్ని శాఖల్లో జీతాలే పడలేదు అని హరీశ్రావు స్పష్టం చేశారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతభత్యాలు ఇచ్చామని సీఎం చెప్పారు. అది సత్య దూరం. ఏడో తారీఖు వరకు కూడా జీతాలు పడ్డాయి. కాంట్రాక్ట్ లెక్చరర్లకు రెండు నెలల జీతాలు రాలేదు. ఐకేపీ, బీవోఏలకు జీతాలు పడలేదు. విద్యాశాఖలో సర్వశిక్షా అభియాన్లో జీతాలు పడని పరిస్థితి. వీటిని సీఎం కరెక్షన్ చేసుకోవాలి.. ఒకటో తారీఖున కాదు.. ఆరేడు తారీఖు వరకు జీతాలు ఇచ్చారని హరీశ్రావు తెలిపారు.
ఈ రాష్ట్రంలో జనవరి నెలలో ఆసరా పెన్షన్లు ఇవ్వలేదు. ఫిబ్రవరి ఒకటి, రెండో తారీఖు నుంచి పెన్షన్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అది జనవరి నెలదా..? ఫిబ్రవరి నెలదా..? స్పష్టత ఇవ్వాలి. ఒకటో తారీఖు రోజునే పెన్షన్లు ఇచ్చామని గొప్పలు చెప్పి పప్పులో కాలేశారు. ఇది కరెక్షన్ చేసుకోవాలి అని హరీశ్రావు సూచించారు. రైతుబంధు విషయంలో అసత్యాలు మాట్లాడారు. తాము రూ. 7500 కోట్ల రైతుబంధు ఇవ్వాల్సి ఉంటే.. దాదాపు రూ. 6 వేల కోట్ల మొదటి నెల రోజుల్లోనే ఇచ్చాం. మిగిలి దాని విషయంలో ఆలస్యం జరిగి ఉండొచ్చు. మీ హయాంలో ఇవ్వాల్సింది ఇంకా చాలా ఉంది అని హరీశ్రావు పేర్కొన్నారు.