Harish Rao | హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ దుష్ర్పచారం చేస్తోంది మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కొత్త ఆయకట్టు 98,570 ఎకరాల గురించే మాట్లాడుతుందని తెలిపారు. కాళేశ్వరం కింద మొత్తం 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారాయని హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఆయకట్టు గురించి ఇంజినీర్లు చెప్పబోతుంటే వారిని దబాయించే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు. మంత్రులు ఇచ్చిన రిపోర్టు ప్రకారం.. 98570 ఎకరాలు కొత్త ఆయకట్టు అని పేర్కొన్నారు. 15 రోజుల క్రితం కొండా సురేఖ రంగనాయక సాగర్ నీటిని విడుదల చేస్తూ లక్షా 10 వేల ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నానని చెప్పారు. మరి మంత్రుల రిపోర్టుకు, కొండా సురేఖ మాటలకు తేడా ఉంది కదా..? అని హరీశ్రావు ప్రశ్నించారు.
456 చెరువులను కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్స్ ద్వారా కలపడం జరిగింది. దీనికింద 39,146 ఎకరాలకు నీళ్లు వచ్చాయన్నారు. ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లను కలిపిన తర్వాత.. అక్కడ కూడా 2143 చెరువులను నింపడం జరిగింది. దాంతో ఒక లక్షా 67 వేల 50 ఎకరాలకు నీళ్లు వచ్చాయి. ఇది కాకుండా ఎస్సారెస్సీ స్టేజీ 1లో తొమ్మిదిన్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఐదారు లక్షలకు మించి నీళ్లు పారలేదు. కానీ కాళేశ్వరంతో కనెక్ట్ చేసిన తర్వాత తొమ్మిదిన్నర లక్షల ఎకరాలకు నీళ్లు పారాయి. ఎస్సారెస్సీ స్టేజీ-2ని గత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేదు. సర్కారు తుమ్మలు మొలిస్తే.. మేం పునరుద్ధరించాం. కాళేశ్వరం ప్రాజెక్టును అనుసంధానం చేసి రెండు పంటలకు నాలుగన్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం. కాంగ్రెస్ హయాంలో ఒక్క చుక్క నీరు రాలేదు. కాళేశ్వరం నీళ్లతో పంటలు కాపాడుకున్న పరిస్థితి. వాస్తవానికి కొత్త ఆయకట్టు కానీ, చెరువుల కింద వచ్చిన ఆయకట్టు కానీ, స్థిరీకరణ చేసింది కలిపితే మొత్తం 20 లక్షల ఎకరాలకు ప్రయోజనం అందింది కాళేశ్వరం ద్వారా. ఈ వాస్తవాన్ని మరుగున పెట్టి కాంగ్రెస్ పార్టీ దుష్ర్పచారం చేస్తోంది అని హరీశ్రావు పేర్కొన్నారు.