ఇల్లెందు, మే 30: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రూ.200 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. గతంలో కోరం కనకయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. అతడి దందాలు, సెటిల్మెంట్లకు అడ్డుకట్ట వేస్తున్నామన్న కారణంతోనే తమపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇల్లెందులోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తమకు, మంత్రి పువ్వాడకు స్కూళ్లు, మెడికల్ కాలేజీలు ఉన్నాయని అన్నారు. విద్యార్థులకు నీతిపాఠాలు చెప్పే తాము..
దందాలు చేసే వారిలా కనకయ్యకు కన్పించడం హాస్యాస్పదమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు మతిభ్రమించిందని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతుండడాన్ని ఓర్వలేకనే దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కోరం కనకయ్య చెబుతున్న మాయమాటలను, తాము చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఎమ్మెల్యేగా కోరం ఉన్నప్పుడు రోళ్లపాడు ప్రాజెక్టు గురించి ఆలోచించాడా? అని ప్రశ్నించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు పులిగళ్ల మాధవరావు, జానీపాషా, ఖమ్మంపాటి రేణుక, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.