హైదరాబాద్, జూన్ 9(నమస్తే తెలంగాణ): సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా దోచుకుంటున్నదని, సంస్థను దివాలా తీయించేందుకు కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంస్థ పరిధిలోని 11 ఏరియాల్లో 3లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నట్టు వెబ్సైట్లో చూపుతున్నప్పటికీ అక్కడ ఎలాంటి లాట్లు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. దాదాపు 32లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని, దీనిపై తక్షణమే సీబీఐ లేదా సీబీ సీఐడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తామే ప్రతి గని వద్ద ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏడాది కాలంగా ఉత్పత్తి లేని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు వద్ద 1.81 లక్షల టన్నుల బొగ్గు ఉన్నట్టు అబద్ధాలు చెప్తున్నారని, బొగ్గు మిస్సింగ్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రి శ్రీధర్బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్జీ-1 (రామగుండం) ఏరియాలో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు తాము, మాజీ మంత్రి హరీశ్రావు వెళ్తుంటే ప్రభుత్వం 600మంది పోలీసులను పెట్టి అడ్డుకున్నదని గంగుల మండిపడ్డారు. ‘ఆర్జీ-1లో ఉన్న బొగ్గు నిల్వలను ప్రత్యక్షంగా చూపించాలని డిమాండ్ చేస్తున్న. రేపు ఉదయం 11గంటల వరకు మంత్రి శ్రీధర్బాబు ఫోన్ కోసం ఎదురుచూస్తా’ అని సవాల్ విసిరారు.
జీతాలు ఇవ్వలేక రూ.4వేల కోట్ల ఓడీ
గతంలో ఏ ముఖ్యమంత్రీ సింగరేణి వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో నిబంధనలు పెట్టి తమ బంధువులు, అనుకూలమైన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని గంగుల ఆరోపించారు. కేసీఆర్ దిగిపోయేటప్పుడు సింగరేణి కోసం రూ.6వేల కోట్లు పకన పెడితే.. ఇవాళ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారని, జీతాల కోసం సంస్థ రూ.4వేల కోట్ల ఓవర్ డ్రాఫ్ట్(రుణాలు) తీసుకోవాల్సి వచ్చిందని విమర్శించారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49శాతం వాటా ఉన్నదని గుర్తుచేశారు. ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే కేంద్ర బొగ్గుశాఖ మంత్రి కిషన్రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో 16 వేల కారుణ్య నియామకాలు చేపట్టామని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ‘కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో’ నినాదంతో ప్రతి గని వద్దకూ వెళ్లి ఆందోళనలు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు.
చంద్రబాబు ఆలోచనలతోనే రేవంత్ పాలన: మిర్యాల రాజిరెడ్డి
నాడు ఉమ్మడి ఏపీలో సింగరేణిని ప్రైవేటీకరించాలని చూసిన చంద్రబాబు ఆలోచనలకు గుణంగానే, ఇవాళ ఆయన శిష్యుడు రేవంత్రెడ్డి నడుచుకుంటున్నారని టీజీబీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి దుయ్యబట్టారు. సమైక్య పాలనలో కేవలం 20వేల మంది ఉద్యోగులు ఉంటే, కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వల్ల నేడు సంఖ్య 36వేలకు చేరిందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలోనే ఓపెన్కాస్ట్ల విస్తరించి, కార్మికుల కోసం భూపాలపల్లిలో 2వేల క్వార్టర్లు, కొత్తగూడెం, సత్తుపల్లి ప్రాంతాల్లో 500 నివాస క్వార్టర్లను కేసీఆర్ కట్టించారని చెప్పారు. నైని బ్లాక్ టెండర్లలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసని, సింగరేణి నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించినట్టు ఆరోపించారు. 2014 నుంచి ఇప్పటివరకు సంస్థపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని రాజిరెడ్డి సవాల్ విసిరారు. హరీశ్రావుపై మంత్రి శ్రీధర్బాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు చిరుమళ్ల రాకేశ్కుమార్, కౌశిక్ హరి, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.