హైదరాబాద్ : విద్య మార్కుల కోసమే కాదు.. సమూలమైన మార్పుల కోసం అని భావించాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు తన బడ్జెట్ ప్రసంగంలో చదివి వినిపించారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ గుర్తు చేశారు. కేజీ టు పీజీ విద్యను కేసీఆర్ ప్రవేశపెట్టారు. ప్రపంచానికి ధీటుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కేజీ టు పీజీపై కేసీఆర్ మూడు రోజుల పాటు చర్చించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా విద్యపై గ్యాదరి కిశోర్ మాట్లాడారు.
అగ్రికల్చర్, ఇరిగేషన్తో పాటు ఎడ్యుకేషన్, హెల్త్ రంగాలపై సీఎం దృష్టి సారించారని కిశోర్ తెలిపారు. ఈ నాలుగు రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవబోతుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని చెప్పి 125 గురుకుల పాఠశాలలను మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. దశల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు అత్యంత అద్భుతంగా కొనసాగుతున్నాయి. విద్యతోనే మార్పు సాధ్యమవుతుందని కేసీఆర్ నమ్ముతారు. గురుకుల పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రూ. లక్షా 25 వేల చొప్పున ఖర్చు అవుతుందన్నారు. నిరుపేద విద్యార్థులకు లాభం చేకూరే విధంగా రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్వహిస్తున్నామని తెలిపారు. రెగ్యులర్, ప్రొఫెషనల్ డిగ్రీ విద్యార్థులకు సమానంగా డైట్ ఛార్జీలు అందుతున్నాయని చెప్పారు.
మహిళలకు ప్రత్యేకంగా 46 మహిళా డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశారు. ఐదింటిలో పీజీ కోర్సులను ప్రవేశపెట్టారు. మహిళలకు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో చెప్పడం అభినందనీయమన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా గురుకుల, ప్రభుత్వ హాస్టళ్లల్లో సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని పేర్కొన్నారు. మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులను కేంద్రం గాలికి వదిలేసింది. కానీ సీఎం కేసీఆర్ మోడల్ స్కూల్స్ను కొనసాగిస్తామని చెప్పి, ఉపాధ్యాయులకు సర్వీస్ బుక్స్ తెరిచి, జీతాలను ఇస్తున్నారు. మోడల్ స్కూల్స్ అద్భుతంగా నడుస్తున్నాయని చెప్పారు. తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగిస్తుందన్నారు. ఏకమైన తెలంగాణను ఆగం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ మండిపడ్డారు.