జమ్మికుంట, జూలై 18: బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరులు జమ్మికుంటలోని అత్యంత విలువైన సర్వే నంబర్ 629, 887లోని ప్రభు త్వ భూములను కబ్జా చేశారని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి ఆరోపించారు. భూముల కబ్జాపై లో కాయుక్తలో పిటిషన్ దాఖలు చేశానని తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటనతోపాటు సోషల్ మీడియా గ్రూపుల్లో లోకాయుక్తలో పిటిషన్, ఈటల అనుచరులపై చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. 2004 నుంచి ఆక్రమణలు జరుగుతున్నాయని సమ్మిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిలో ఇండ్లు కట్టుకున్న పేదల కోసం సీఎం కేసీఆర్ 58, 59 జీవోలు విడుదల చేశారని, ఆ జీవోలను అడ్డుపెట్టుకొని ఐదెకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు.
అధికారులు అవినీతి సొమ్ముకు అలవాటుపడి క్రమబద్ధీకరణ చేశారని ఆరోపించారు. ఒక్కొక్కరు 500 గజాల నుంచి 1,500 గజాల భూమిని కొల్లగొట్టారని చెప్పారు. అసైన్డ్ కమిటీ చైర్మన్గా ఉన్న ఎమ్మెల్యే ఖరీదైన భూములను అనుచరులకు కట్టబెట్టారని విమర్శించారు. 20 ఏండ్లుగా ఎమ్మెల్యే గా ఉన్న ఈటల ప్రజల కోసం ఒక్క వైకుంఠధామం ని ర్మించలేదని, అనుచరులకు మాత్రం వేల గజాల భూమి ని ఇప్పించారని దుయ్యబట్టారు. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని లోకాయుక్తలో కేసు వేసినట్టు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా 58,59 జీవోలో క్రమబద్ధీకరణ చేసిన, చేయబోతున్న భూముల దరఖాస్తులను రద్దు చేయాలని కోరారు.