వరంగల్ : కాంగ్రెస్, బీజేపీ పార్టీల వాళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, రానున్న ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి, యువత భవిష్యత్తుకు బాసట చూపుతానని పరకాల నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి(MLA Dharma Reddy ) అన్నారు. పరకాల నియోజకవర్గం సంగెం మండలంలోని నల్లబెల్లి, బాలునాయక్ తండా, కొత్తపల్లి, నార్లవాయి, ఎల్గూరు స్టేషన్, నర్సానగర్, బిక్కోజినాయక్ తండా తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. అరవై ఏండ్లు అధికారంలో ఉండి ప్రజలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికలు రాగానే ఆరు గ్యారెంటీలు అంటూ మోసపూరితమైన వాగ్దానాలు చేస్తున్నారని, వాటిని ప్రజలు విశ్వసించరని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.