సడలింపు సమయంలోఒకేసారి రోడ్లపైకి జనం
కిక్కిరిసిపోతున్న మార్కెట్లు
తొందరలో జాగ్రత్తలు విస్మరించొద్దు
సమస్యలు ‘కొని’ తెచ్చుకోవద్దు
ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసుకుంటే మేలు
నాలుగో రోజూ పక్కాగా లాక్డౌన్
ఉల్లంఘనలపై నల్లగొండ జిల్లాలో 490, సూర్యాపేటలో 680 కేసులు
…ఇలా లాక్డౌన్ నేపథ్యంలో పలువురు ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్నారు. రద్దీ లేని ఏరియాలను ఎంచుకోవడంతోపాటు టైమ్ షెడ్యూల్నూ మార్చుకుంటున్నారు.రోజూ బయటకు వెళ్లకుండా నాలుగైదు రోజులకు సరిపడా సరుకులు తీసుకుంటు న్నారు. కొవిడ్ వేళ ఇలాంటి జాగ్రత్తలు అవసరం కూడానూ. మరోవైపు ప్రణాళిక లేకుండా బయటకు వచ్చి ముప్పు కొనితెచ్చుకుంటున్నవాళ్లూ ఉంటున్నారు.
మిర్యాలగూడ హనుమాన్నగర్ ఉండే రమేశ్ ఉదయం పాల ప్యాకెట్ల కోసం మిల్క్ సెంటర్కు వెళ్తే రెండ్రోజుల నుంచి విపరీతంగా రద్దీ కనిపిస్తున్నది. దాంతో ఇంటికే తెచ్చిపోసేలా సమీపంలోని శ్రీనివాస్నగర్కు చెందిన రైతు దగ్గర వాడుక పట్టడం మొదలుపెట్టాడు.
సూర్యాపేట శంకర్విలాస్కు చెందిన కార్తీక్ మార్నింగ్ వాకింగ్కు వెళ్లి తిరిగొచ్చే సమయంలో ఏరోజుకారోజు కూరగాయలు కొనేవాడు. ఇప్పుడు పదింటి దాకా
మార్కెట్లో ఇసుకేస్తే రాలనంతగా జనం ఉంటుండడంతో వాకింగ్కు ముందే ఇంటికి సమీపంలోని షాపు దగ్గర కూరగాయలు
కొని ఇంట్లో వాళ్లకు ఇచ్చి వెళ్తున్నాడు.
నల్లగొండ వీటీకాలనీవాసి శ్రావణి డ్రైఫ్రూట్స్ కోసం ప్రకాశం బజార్లోనిదుకాణానికి వెళ్లగా జనం క్యూ కట్టడంతో కొవిడ్ వేళ అక్కడంత సేఫ్ కాదనుకుని ఇంటికొచ్చి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది.
మహమ్మారి కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతున్నది. అందులో భాగంగానే అమలు చేస్తున్న లాక్డౌన్కు అన్ని వర్గాల ప్రజలు నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. నాలుగో రోజైన శనివారం కూడా మెజారిటీ జనం ఉదయం 10 గంటల తర్వాత ఇంట్లోనే ఉన్నారు. నిత్యావసరాలు, ఇతరత్రా కొనుగోళ్ల కోసం సడలింపు ఇచ్చిన ఉదయం 6 నుంచి 10 గంటల్లోపు మాత్రం కనీస జాగ్రత్తలు మరిచి మార్కెట్లలో హడావిడిగా ఉరుకులు పరుగులు తీశారు. 8 తర్వాత బయటకు వచ్చిన వాళ్లు టైమ్ అయిపోతుందనే తొందరలో ఓవైపు సెల్ఫోన్లు, వాచీలు చూసుకుంటూ.. మరోవైపు సరుకుల సంచులు సరిచేసుకుంటూ టెన్షన్ పడుతూ కనిపించారు. ప్రణాళిక లేకుండా బయటకు రావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతున్నదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో జాగ్రత్తగా వ్యవహరించడం, భౌతిక దూరం పాటించడం, మాస్క్ సరిగ్గా పెట్టుకోవడం, శానిటైజర్ వాడడం వంటివి అలవాటుగా మారితేనే
వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత త్వరగా కట్టడి చేయొచ్చని, ఇది సమాజంలోని అందరికీ క్షేమదాయకమని వైద్యులు చెబుతున్నారు.
నల్లగొండ ప్రతినిధి, మే 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్లోనూ సదుద్దేశంతో ఇచ్చిన నాలుగు గంటల సడలింపు సమయంలో ప్రజలు నిత్యావసరాలు, కూరగాయలు, ఇతర సామగ్రి కొనుగోళ్లు చేసేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అయితే లాక్డౌన్ దృష్ట్యా అన్నిరకాల వ్యాపార సంస్థలు ఈ నాలుగు గంటల సమయంలోనే తెరుచుకుంటున్నాయి. కిరాణా దుకాణాలు, ఇతర వస్తు దుకాణాలు, అన్ని రకాల వ్యాపార సంస్థలు, ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బట్టలు, బంగారం దుకాణాలు, మందుల షాపులు, స్వీటు, బేకరీ షాపులు, ఆటోమొబైల్స్, వివిధరకాల వాహన సర్వీసింగ్ కేంద్రాలు ఇలా అన్నీ ఓపెన్ చేస్తున్నారు. ఈ సమయంలోనూ ఎంతో కొంత బిజినెస్ జరిగితే ఆర్థిక అవసరాలకు ఆసరాగా ఉంటుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అన్నిరకాల పనుల కోసం ఇదే సమయంలో ఒక్కసారిగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో నల్లగొండలోని ప్రకాశంబజార్, రామగిరి, నెహ్రుగంజ్, హైదరాబాద్ రోడ్డు లాంటి ప్రాంతాలన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. మిర్యాలగూడలోని కూరగాయల మార్కెట్, బస్టాండ్ ఏరియా, రౌండ్ పరిసరాల్లోనూ ఇదే రకమైన వాతావరణం కనిపిస్తున్నది. వీటితో పాటు హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ లాంటి మున్సిపల్ కేంద్రాల్లోనూ ప్రధాన వ్యాపార కేంద్రాలన్నీ జనంతో సందడిగా మారుతున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంతోపాటు కోదాడ, హుజూర్నగర్, నేరడుచర్ల, తిరుమలగిరి లాంటి పట్టణాల్లోనూ ప్రజలంతా ఒకేసారి మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. దీంతో చాలాచోట్ల కొవిడ్ నిబంధనలను ప్రజలు సరిగ్గా పట్టించుకుంటున్నట్లు లేదు. ఆ సమయంలో కొందరు కొవిడ్ బారిన పడే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే సడలింపు సమయంలోనూ ప్రజలు స్వీయ నియంత్రణకు ప్రాధాన్యతిస్తూ అవసరాలను వెళ్లదీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పనిసరైన వస్తువుల కొనుగోలుకే ప్రాధాన్యం ఇస్తూ సరైన రీతిలో మాస్క్ ధరిస్తూ, శానిటైజర్ను తరుచుగా వాడుతూ, భౌతికదూరం పాటిస్తూ బయటకు రావడం ఆవశ్యకంగా కనిపిస్తున్నది.
సరైన ప్రణాళిక ముఖ్యం
సడలింపు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సరైన ప్రణాళిక ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తేనే వ్యక్తిగతంగా వారికి, సామాజికంగా ప్రజలందరికీ మంచిది. ఏ వస్తువు కొనుగోలు చేయాలనుకుంటున్నామో అది ఎక్కడ దొరికే చాన్స్ ఉందో సరైన సమాచారంతో బయలుదేరాలి. అదేవిధంగా అందరూ ఒకేచోటకు వెళ్లాలనుకోవడం కూడా మానుకుంటే మంచిది. నల్లగొండలోని ప్రకాశంబజార్లోనే అన్ని దొరుకుతాయని అందరూ అక్కడికే వెళితే అక్కడ ఒక్కోసారి కాలుపెట్టే వీలు కూడా ఉండడం లేదు. కానీ అవే వస్తువులు అమ్మే దుకాణాలు ఏరియాల వారిగా అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇతర ప్రాంతాల్లోని దుకాణాలను ఎంచుకుంటే రద్దీ నుంచి దూరంగా ఉండడానికి చాన్స్ ఉంది. అదేవిధంగా ప్రస్తుతం అన్నిచోట్ల కూరగాయలు రోడ్లపక్కనే అందుబాటులో ఉంటున్నాయి. వీటికోసం ప్రత్యేకంగా కూరగాయల మార్కెట్లకే పరుగులు పెట్టడం కూడా అనవసరం. ఇక ఇతర సామగ్రి విషయంలోనూ తాము నివసించే ఏరియాల్లోని దుకాణాలపై ఈ ఆపత్కలంలో ఆధారపడితే పెద్దగా నష్టం జరిగేది కూడా ఏమీ ఉండదు. సాధ్యమైనంత వరకు జనబాహుళ్యం ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. దీంతోపాటు నిత్యం కాకుండా ఒకేసారి ప్రణాళికతో తప్పనిసరైన వాటిని కొనుగోలు చేసుకోవాలి. కొందరైతే చిన్నచిన్న వాటి కోసం కూడా నాలుగైదు చోట్లకు తిరుగుతున్నారు. ఇంకొందరైతే అన్నీ ఒకేసారి కొనుగోలు చేయాలన్న ఆత్రుతతో కనిపిస్తున్నారు. వీటన్నింటి ఫలితంగా నిత్యం ఎక్కడో ఓ చోట మళ్లీ కరోనా బారిన పడుతున్న సందర్భాలు వెలుగు చూస్తునే ఉన్నాయి.
రద్దీకి దూరంగా ఉండాలి
లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇష్టానుసారంగా రోడ్లపై తిరిగితే కరోనా బారిన పడే ప్రమాదం ఉంది. గుంపులుగుంపులుగా కొనుగోళ్లకు సిద్ధపడితే కరోనా వ్యాప్తికి కారకులవుతారు. ప్రతిఒక్కరూ రద్దీకి దూరంగా ఉండాలి. సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే ప్రజల పాత్రనే కీలకం. సరైన పద్ధతిలో మాస్క్ ధరించడం, తరుచూ శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.
విచ్చలవిడితనం వద్దు
లాక్డౌన్ సమయంలో అత్యవసరాల కోసమే ఈ సడలింపు ప్రక్రియ. కానీ అన్ని అవసరాల కోసమంటూ బయటకు వస్తే వారికే ముప్పు. ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాదా అని విచ్చలవిడితనంగా ఉండొద్దు. వైరస్ బారిన పడే ప్రమాదం పొంచి ఉంటుంది. నిత్యావసరాలు ఒకేసారి కొనుగోలు చేసుకుంటే బెటర్. రోజూ బయటకు రాకుండా వారానికి ఓ సారి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు జనసమూహంలోకి వెళ్లకూడదు. అందుబాటులో ఉన్న ఏరియాల్లో కొనుగోళ్లు చేయాలి. మాస్కు ధరిస్తూ, భౌతికదూరం పాటించాలి.
– ఏవీ రంగనాథ్, ఎస్పీ, నల్లగొండ