వరంగల్ : కాంగ్రెస్(Congress)కు ఓటేస్తే మళ్లీ కష్టాలు కొని తెచ్చుకున్నట్టేనని పరకాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి(MLA Challa Dharma Reddy )అన్నారు. జిల్లాలోని గీసుగొండ మండలం చంద్రయ్యపల్లె గ్రామంలో ఆయన ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన చల్లాకు ప్రజలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో కొత్త పింఛన్ రావాలంటే.. అప్పటికే పింఛన్ వస్తున్న వారు చనిపోతేనే వచ్చే అవకాశం ఉండేదని గుర్తుచేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత పింఛన్ను క్రమంగా పెంచామని..ఈ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా రూ.5,016కు పెంచుతామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఉంటే వార్త.. నేడు బీఆర్ఎస్ పాలనలో కరెంటు పోతే వార్త. నాడు రైతు ఆత్మహత్యలు.. నేడు రైతు రైతుబంధులు.. ఇవన్నీ ప్రజలు గమనించాలన్నారు. అధికార దాహంతో ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్, బిజెపి పార్టీలు చూస్తున్నాయి. ప్రలోభాలకు గురిచేయాలని చూస్తున్నాయి.
నేడు నేను చేసిన అభివృద్ధి మీ ఇంటి ముందు, కంటి ముందు ఉంది. పని చేసే వారికి పట్టం కట్టాలన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభవృద్ధి చేసియువత భవిష్యత్ కు బాటలు వేస్తానని అన్నారు. నేడు పరకాలలో బరిలో ఉన్న ప్రతిపక్ష నాయకులకు ప్రజల కష్ట నష్టాలు తెలిసిన వారు కాదు. ఎన్నికల్లో ఓడిపోయాక వారి అడ్రస్ ఉండదని అన్నారు. పక్క నియోజకవర్గ ప్రజలు తరిమికొడితే ఇక్కడికి వచ్చారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు.