హైదరాబాద్ : దళితుల జీవితాల్లో దళిత బంధు ఒక నవశకం అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. దేశంలో అత్యంత వెనుబడిన జాతి దళిత జాతి అని తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్యాయానికి గురైన జాతి దళిత జాతి. ఈ దళిత జాతికి సంబంధించి గుర్రం జాషువా గబ్బిలం కావ్యంలో స్పష్టంగా రాశారు. భారతావని దళితజాతికి బాకీ పడిందని చెప్పారు. దాన్ని పూర్తిస్థాయిలో గుర్తించిన మహానుభావుడు కేసీఆర్ మాత్రమే. దళితజాతికి భారతావని బాకీ పడ్డదని కేసీఆర్ గుర్తించి దళితబంధు లాంటి పథకం దళితజాతి కోసం తీసుకొచ్చారు. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం భారతజాతి అంబానీ, అదానీకి బాకీ పడ్డదని చెప్పి దేశానికి సంబంధించిన లక్షల కోట్ల సంపదను వారికి అప్పజెప్పుతున్నారు. ఇందుకు బాధపడుతున్నాను అని సుమన్ పేర్కొన్నారు.
దళిత జాతి అభ్యున్నతి కోసం ఒక సువర్ణ అధ్యాయాన్ని కేసీఆర్ లిఖించారని ఎమ్మెల్యే బాల్క తెలిపారు. కొత్తగా ఎమ్మెల్యే ఎన్నికైనప్పుడే సిద్దిపేటలో దళితుల అభ్యున్నతి కోసం దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని అమలు చేశారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని దానయ్య అనే దళితుడికి ఇచ్చి ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో విప్లవం సృష్టించారు. ఉద్యమ సమయంలో తెలంగాణలో దళితులు బాగుపడాలంటే ఏం చేయాలనే అంశంపై దళిత మేధావులతో చర్చించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాలు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాలు అమలు చేస్తున్నారు.
దళితుల పట్ల సీఎం కేసీఆర్ అపారమైన ప్రేమ చూపిస్తున్నారని బాల్క సుమన్ స్పష్టం చేశారు. దళిత బంధు పథకం దేశంలో గేమ్ ఛేంజర్లా ఉండ బోతుందన్నారు. దళితులను ధనవంతులుగా, దళపతులుగా మార్చే పథకం దళితబంధు. దళితుల జీవితాల్లో దళిత బంధు ఒక నవశకం. కేంద్రం దళితులను పట్టించుకోవడం లేదు. దళితులపై ప్రేమ ఉందని నిరూపించుకోవాలంటే.. దేశ వ్యాప్తంగా దళిత బంధును అమలు చేయాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.