వరంగల్ : మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. పర్వతగిరి మండలం అన్నారం చెరువులో ఎమ్మెల్యే రూ.35 వేల విలువగల 45 వేల ఉచిత చేప పిల్లలను వదిలారు. అనంతరం ముదిరాజ్ కమ్యూనిటీ హల్ భవన నిర్మాణానికి సంబందించిన రూ.10లక్షల ప్రొసీడింగ్ కాపీని గ్రామస్తులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ హయాంలో మత్స్య కార్మికుల కష్టాలు తీరాయని, వారు ఆర్థికంగా ఎదిగాలని ఉచిత చేపపిల్లలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని, అలాగే మత్స్యకారుల సొసైటీల ఏర్పాటు సబ్సిడీలపై వలలు, ద్విచక్ర వాహనాలు అందజేయడంతో వారు ఆర్థికంగా బలపడ్డారని చెప్పారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మత్స్యశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.