వరంగల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న అన్ని మండలాలు, గ్రామాలలో చేపట్టనున్న నిరసన కార్యక్రమాలలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పిలుపునిచ్చారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నాయకులు రైతులను అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరూరి రమేశ్ మాట్లాడారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అన్ని మండలాలు, గ్రామాల్లో బీజేపీ, కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు సీఎం కేసీఆర్ అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కానీ కేంద్రం మాత్రం రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తోందన్నారు. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనకుండా.. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కేంద్రం యత్నిస్తోందని ధ్వజమెత్తారు.