వర్ధన్నపేట, ఏప్రిల్ 16: రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నిరుద్యోగ మార్చ్ పేరుతో యువతను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ విమర్శించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని తన క్యాం పు కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి ఆదివారం మీడియా తో మాట్లాడారు. పది పరీక్ష పేపర్ లీకేజీకి పాల్పడి జైలుకు పోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తిరిగి యువత మెప్పు పొందేందుకే హనుమకొండలో నిరుద్యోగ మార్చ్ చేపట్టాడని ఆరోపించారు.
ఈ యాత్ర లో కేవలం బీజేపీ కార్యకర్తలు తప్ప నిరుద్యోగులు పాల్గొనలేదని స్పష్టంచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసిందో నిరుద్యోగులకు తెలపాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కేటీఆర్, కవితపై కుట్రలు చేస్తూ కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, తప్పుడు విధానాలకు పాల్పడితే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ, వైస్ చైర్మన్ ఏలేందర్రెడ్డి పాల్గొన్నారు.