NIMS | ఖైరతాబాద్, ఏప్రిల్ 11: ఎన్నో క్లిష్టమైన వైద్య చికిత్సలు అందిస్తూ ఎన్నో ప్రాణాలను నిలుపుతున్న నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. మెట్రల్ వాల్వ్ పూడుకుపోయిన ఓ వృద్ధురాలికి ఆధునిక చికిత్సా విధానంతో పునరుద్ధరించి ప్రాణదానం చేశారు. జగిత్యాలకు చెందిన దేవమ్మ (67)కు గతంలో బైపాస్ సర్జరీ నిర్వహించి మెట్రల్ వాల్వ్ మార్పిడి చికిత్స చేశారు. ఇటీవల ఆ వాల్వ్ పూర్తిగా పూడుకుపోయింది. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆమెకు పలు ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానాలకు తీసుకెళ్లినా అందరూ చేతులెత్తేశారు. దీంతో నిమ్స్ దవాఖానను ఆశ్రయించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్ శ్రీనివాస్ బృందం.. గతంలో బైపాస్ సర్జరీ జరిగినందున మరోసారి అదే శస్త్రచికిత్స నిర్వహిస్తే ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని భావించి ఆధునిక చికిత్సా విధానాన్ని అనుసరించారు.
ఆమెకు ట్రాన్స్ క్యాథటర్ మెట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్ పద్ధతిని అవలంబించారు. కోత లేకుండా తొడ భాగం నుంచి క్యాథటర్ను నరాల ద్వారా సెప్టాల్ పంచర్ చేసి గుండె దగ్గర ఉన్న మెట్రాల్ వాల్వ్ను కేవలం రెండు గంటల్లోనే పునరుద్ధరించారు. ప్రస్తుతం ఆమె వేగంగా కోలుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని కొన్ని సమస్యలకు ఇలాంటి చికిత్స విధానం అవసరం ఉంటుంది. ఈ కేసులో ఆమెకు సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చయింది. ఆమెకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మొత్తం సాయం అందింది. వైద్య రంగానికి సంబంధించి పేదలకు తెలంగాణ ప్రభుత్వం అపారమైన సేవ చేస్తున్నది. ఆరోగ్యశ్రీలో వర్తించని అనేక వైద్య చికిత్సలకు సీఎంఆర్ఎఫ్ వరప్రదాయినిగా మారింది. అందుకు ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
డాక్టర్ బీ శ్రీనివాస్, హెచ్వోడీ, నిమ్స్ కార్డియాలజీ విభాగం