Telangana Decade Celebrations | చెరువు పల్లె బతుకుకు ఆదరువు. ఊరుమ్మడి బతుకు చిత్రం. తెలంగాణ సాంస్కృతిక వైభవం. కానీ ఉమ్మడి రాష్ట్రంలో వలసపాలకుల కుట్రపూరిత చర్యలతో ఆ చెరువు నిర్లక్ష్యానికి గురైంది. జలదోపిడీకి బలిపశువుగా మారింది. పూడిక చేరి, కట్టలు కరిగి..నిల్వ నీరు లేకుండా బోసిపోయింది. ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణ ఉద్యమ నినాదమైంది. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆ ఉద్యమ ఆకాంక్షలకు జీవం పోస్తూ ‘మిషన్ కాకతీయ’ పథకానికి రూపకల్పన చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చెరువుల పునరుద్ధరణపై దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువుల లెక్క తేల్చారు. మొత్తంగా 46,531 చెరువులు, వాటి కింద 24.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నట్టు గుర్తించి, పునరుద్ధరణకు నడుం బిగించారు. 2015 మార్చి12న నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ పాత చెరువు వద్ద సీఎం కేసీఆర్ స్వయంగా ‘మిషన్ కాకతీయ’కు శ్రీకారం చుట్టి నవ తెలంగాణకు పునాది వేశారు. ఇప్పటి వరకు నాలుగుదశల్లో రూ.9,155 కోట్లతో 27,527 చెరువులను పునరుద్ధరించారు. దీంతో ఆయా చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలకుపైగా పెరిగింది.
ప్రాజెక్టుల అనుసంధానంతో ఏడాదిపొడవునా..
తెలంగాణ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణతో ఆగిపోకుండా వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే దిశగా ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నది. తెలంగాణ భూ భౌతిక పరిస్థితులకు అనుగుణంగా కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల సాగునీటి వ్యవస్థ తెలంగాణకు ప్రాణప్రదమైనది. సమైక్యపాలనలో చెరువుల వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. కాకతీయులు చూపిన బాటలో సీఎం కేసీఆర్ చేసిన బృహత్తర ఆలోచనే.. ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించబడిన చెరువులను ఆయా బేసిన్ల పరిధిలోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో అనుసంధానం చేశారు. ఇప్పటివరకు దాదాపు 15 వేల చెరువులకుపైగా ప్రాజెక్టులతో ముడిపెట్టారు. ఆయా పంటకాలువలకు ఎక్కడికక్కడ ఓటీలను ఏర్పాటు చేసి చెరువులను క్రమం తప్పకుండా ప్రాజెక్టు నీటితో నింపుతున్నారు. ఫలితంగానే నేడు ఎండాకాలంలో సైతం పూర్తిస్థాయి నీటి నిల్వతో చెరువులు నిండుగా దర్శమిస్తున్నాయి. మరోవైపు వాగుల పునరుజ్జీవ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా చెక్డ్యామ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తంగా 1,200 చెక్డ్యామ్లు నిర్మించాలని ప్రణాళికలు రూపొందించగా, ఇప్పటికే 650 నిర్మాణాలు ప్రారంభించి 400 మేరకు పూర్తి చేసింది.
గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం
జలవనరులు పెరగటంతో తిరిగి తెలంగాణ పల్లె పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నది. ఒకనాడు చిధ్రమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రాణం పోసుకున్నది. నేడది రాష్ట్ర ప్రగతి రథానికి ప్రధాన ఇరుసుగా మారింది. ఒకవైపు పంటల సాగువిస్తీర్ణం పెరగటం, మరోవైపు అనుబంధరంగాల విస్తరణ శరవేగంగా దూసుకుపోతున్నది. మత్స్య పరిశ్రమ కూడా గణనీయంగా వృద్ధిని సాధించింది. అదేవిధంగా జీవాలు, పాడిపశువులకు నీటి కొరత లేకుండా పోయింది. పాడి అభివృద్ధికి కూడా ఇప్పుడు తెలంగాణ చిరునామాగా నిలుస్తున్నది. ఎవుసం, పాడి పెరగటంతోపాటు ఇతర వృత్తికులాలకు కూడా నేడు నూతన జవసత్వాలు వచ్చి చేరాయి.
నేడు రాష్ట్రవ్యాప్తంగా చెరువుల పండుగ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువుల పండుగను ప్రత్యేకంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చెరువుల పండుగను నిర్వహించనున్నారు. చెరువుల వద్ద కట్ట మైసమ్మ పూజల నిర్వహణతోపాటు, బోనాలు, బతుకమ్మలు, ప్రగతి నివేదిక ప్రదర్శన చేపట్టేందుకు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం మిషన్కాకతీయ డాక్యుమెంటరీలను ప్రదర్శిస్తారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులతోపాటు, మిషన్ కాకతీయ దాతలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించటం విశేషం.
పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం
చెరువుల పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. అధికారులకు బాధ్యతలను అప్పగించాం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. నియోజకవర్గస్థాయిలో ప్రగతి నివేదికలను కూడా ప్రత్యేకంగా రూపొందించాం. చెరువుల పండుగ రోజున ప్రదర్శిస్తాం. ఉత్సవాల్లో అందరూ భాగస్వాములు కావాలి. చెరువుల పండుగను విజయవంతం చేయాలి.
– సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్