Mission Bhagiratha | అలంపూర్, ఫిబ్రవరి 18 : కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు నీటికష్టాలు రాకుండా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా ద్వారా మంచి నీటిని అందించింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే, అదీ వేసవి రాకముందే నీటికి కటకట ఏర్పడింది. పాలకులు, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా నీటి ఎద్దడి ఏర్పడుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలోని 9వ వార్డులోగల న్యూ ప్లాట్స్ కాలనీకి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోవడంతో మూడు రోజులుగా కాలనీకి నీళ్లు రావడం లేదు. మరమ్మతులు చేస్తున్నామని చెబుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. దీంతో కాలనీ మొత్తానికి ఉన్న ఒక్క బోరు వద్ద నీటిని పట్టుకునేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు.
ఒక్క బిందె నీటి కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నదని స్థానికులు వాపోతున్నారు. పనులు వదులుకొని నీటికోసం సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు చొరవ తీసుకొని నీటి కొరత నివారించాలని ప్రజలు కోరుతున్నారు. ఎయిర్వాల్స్ లేకపోవడంతోనే పదేపదే పైపులు పగులుతున్నాయని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. కాగా పట్టణంలోని 3, 4, 6వ వార్డుల్లోనూ నీటి ఎద్దడి నెలకొన్నది.