బాన్సువాడ/బీర్కూర్, నవంబర్ 22: రాష్ట్రం లో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సదరు నాయకులు నోరు అదుపులో పెట్టుకొంటే మంచిదని హెచ్చరించారు. మంగళవారం ఆయన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు.
రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలో లేవన్నారు. కేంద్రం వ్యవసాయ బోరు మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తే.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు. గతంలో కరెంటు కోసం రైతులు, తాగునీటి కోసం మహిళలు ధర్నాలు చేసేవారని.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అలాంటి ఇబ్బందులు తొలగిపోయాయని తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో కోటి ఇండ్లకు నల్లాల ద్వారా తాగునీరు సరఫరా అవుతున్నదన్నారు. 48 లక్షల మంది పేదలకు ఆసరా పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. ‘ఈ మధ్య ఒకాయన ఆడబిడ్డను అనరాని మాటలు అన్నాడు.. ఉన్నత పదవిలో ఉండి ఆ విధంగా మాట్లాడవచ్చా’ అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశంలో కొత్తగా 150 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే రాష్ర్టానికి ఒక్కటి కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు.